భారతదేశంలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతోంది. గాలి, నీరు.. చివరకు తినే తిండి కూడా కాలుష్యం అవుతోంది. ముఖ్యంగా దేశంలో వాయు కాలుష్యం పెను సవాలుగా మారింది. దేశ రాజధాని దిల్లీ వంటి ముఖ్య నగరాల్లో ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యం గల నగరాల జాబితాలో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. స్విట్జర్ల్యాండ్కు చెందిన ఐక్యూ ఎయిర్ వెల్లడించిన ప్రపంచ వాయు నాణ్యత నివేదికలో ఈ విషయం తేలింది.
2021తో పోలిస్తే ఐదు నుంచి ఎనిమిదో స్థానానికి చేరినా ఆందోళనకర పరిస్థితులు తొలగినట్టు కాదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నివేదికను శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు గుర్తించిన పీఎం 2.5 స్థాయి కాలుష్య కారకం ఆధారంగా రూపొందించారు. 131 దేశాలకు చెందిన 30 వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి ఈ సమాచారాన్ని సేకరించారు. పీఎమ్ 2.5 వల్ల 20 లక్షలకు పైగా అకాల మరణాలు సంభవించినట్టు ఈ నివేదిక వెల్లడించింది.