వైసిపి ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమా. ప్రధాని మోడీకి సీఎం జగన్ ఇచ్చిన వినతి పత్రాన్ని మీడియాకి ఇవ్వలేని దౌర్భాగ్య, నిస్సహాయ స్థితిలో సిఎం ఉండడం సిగ్గుచేటని అన్నారు. 22 ఎంపీలు, 9 రాజ్యసభ సభ్యులుండి కూడా విభజన హామీలు సాధించలేకున్నారని మండిపడ్డారు. పోలవరం నిర్వాసితులను ఆదుకునేవారే కరవయ్యారని అన్నారు దేవినేని ఉమా.
పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలంటే అనుమతి కావాలనడం సిగ్గుచేటుని మండిపడ్డారు. టీడీపీ హయాంలో చేసిన డయాఫ్రమ్ వాల్ పనులకు రీయంబర్స్ ఇస్తే దాన్ని లిక్కర్ కంపెనీలకు అడ్వాన్సులు ఇచ్చుకోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వ అసమర్థతతో లోయర్ కాపర్ డ్యాములో నుంచి ఇసుక రవాణాకు పాల్పడి నాశనం చేశారని ఫైర్ అయ్యారు. టీడీపీపై బురదజల్లడం, అవినీతి ఆరోపణలు చేయడం, నాయకులను జైళ్లల్లో పెట్టడం తప్ప ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచనలేదని దుయ్యబట్టారు దేవినేని ఉమా.