బీజేపీకి.. టీఆర్ఎస్, ఎంఐఎం ఏజెంట్లు : జైరాం రమేశ్‌

-

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ తెలంగాణలో కొనసాగుతోంది. ఈ యాత్రకు దేశవ్యాప్తంగా సామాన్యుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో ‘భారత్‌ జోడో యాత్ర’ తెలుగు పాటను ఆయన విడుదల చేశారు. ప్రజలు చెప్పేది రాహుల్‌ వింటున్నారని.. మన్‌కీ బాత్‌లా ఆయన వన్ సైడ్ స్పీచ్‌ ఇవ్వడం లేదని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీకి టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఏజెంట్లుగా ఉన్నాయని ఆరోపించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విధానాలతో దేశం నష్టపోతోందని జైరాం రమేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ పాలనలో ఆర్థిక అసమానతలు పెరిగాయని ఆరోపించారు. విభజించు-పాలించు అన్న చందంగా పాలన చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో నియంతృత్వం పెరిగిపోయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరహాలోనే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నియంత పాలన సాగిస్తోందని విమర్శించారు. ఏపీలో వైసీపీదీ అదే బాట అని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ బలం పుంజుకుంటుందని.. ఈ యాత్రతో రాష్ట్రంలో, దేశంలో కీలక రాజకీయ మార్పులు తథ్యమని జైరాం రమేశ్‌ జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ లేనిదే విపక్షాల ఐక్యత సాధ్యం కాదన్నారు. బీజేపీని ఎదుర్కోవాలంటే ఎవరైనా కాంగ్రెస్‌తో కలవాల్సిందేనని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news