అమిత్‌షా- జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీ… క్లారిటీ ఇచ్చిన కిషన్‌ రెడ్డి

-

భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రముఖ సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆదివారం సమావేశం అయిన విషయం తెలిసిందే. మొత్తం 45 నిమిషాల సేపు సాగిన సమావేశంలో 20 నిమిషాలు ఇద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నారు. వీరిద్దరి సమావేశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. తాజాగా అమిత్‌ షా – ఎన్టీఆర్‌ భేటీపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు.

కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ”ఇద్దరి మధ్య సినిమాల గురించి మాత్రమే చర్చ జరిగింది. సీనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకున్నారు. తెదేపాను ప్రజల్లోకి తీసుకెళ్లిన వైనంపై ఇద్దరి మధ్య చర్చకు వచ్చింది” అని పేర్కొన్నారు.

అమిత్ ఎన్టీఆర్ భేటీ
అమిత్ ఎన్టీఆర్ భేటీ

ఆదివారం మునుగోడులో నిర్వహించిన బహిరంగ సభ ముగిసిన అనంతరం హైదరాబాద్‌ విచ్చేసిన అమిత్‌షా శంషాబాద్‌ విమానాశ్రయంలోని నోవాటెల్‌కు రాత్రి 10.26కి చేరుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ అక్కడికి వచ్చారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఎన్టీఆర్‌ను అమిత్‌షా వద్దకు తీసుకెళ్లారు. ఎన్టీఆర్‌ను అమిత్‌షా పుష్పగుచ్ఛంతో ఆహ్వానించగా.. అమిత్‌షాకు ఎన్టీఆర్‌ శాలువా కప్పి సత్కరించారు. అనంతరం వీరిద్దరితో పాటు పార్టీ నాయకులు కిషన్‌రెడ్డి, తరుణ్‌ఛుగ్‌, బండి సంజయ్‌లు కలిసి భోజనం చేశారు.

అమిత్ ఎన్టీఆర్ భేటీ
అమిత్ ఎన్టీఆర్ భేటీ

సీనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాల ప్రస్తావన.. జూనియర్‌తో భేటీ సందర్భంగా అమిత్‌షా సీనియర్‌ ఎన్టీఆర్‌ గురించి ప్రస్తావించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్టీఆర్‌ నటించిన విశ్వామిత్ర, దానవీరశూర కర్ణ సినిమాలు తాను చూశానని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులు బాగా పనిచేసేవారని ప్రశంసించారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌తో సమావేశ విషయాన్ని అమిత్‌ షా ట్విటర్‌లో వెల్లడించారు. ‘అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, తెలుగు సినిమా తారకరత్నం అయిన జూనియర్‌ ఎన్టీఆర్‌ను హైదరాబాద్‌లో కలిసి మాట్లాడడం చాలా ఆనందంగా అనిపించింది’ అని భాజపా అగ్రనేత పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news