తమన్, దేవీశ్రీలపై మణిశర్మ వైరల్ కామెంట్స్

-

మెలోడి బ్రహ్మ మణిశర్మ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోలందరితోనూ మణిశర్మ పనిచేశారు. బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లు అందించారు. 200కు పైగా సినిమాలకు కీబోర్డ్ ప్లేయర్‌గా, సంగీత దర్శకుడిగా పనిచేశారు. మెగాస్టార్ చిరంజీవి ‘చూడాలనివుంది’ సినిమాతో పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన మణిశర్మ.. తెలుగులో స్టార్ మ్యూజిక్ కంపోజర్‌గా ఎదిగారు. మరి ఈ లెజెండరీ మ్యూజిక్‌ డైరక్టర్‌ ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు.

తన సహ సంగీత దర్శకులు, శిష్యులైన దేవీ శ్రీ ప్రసాద్(డీఎస్పీ)​, తమన్​తో తనకున్న అనుబంధం గురించి మాట్లాడారు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. డీఎస్పీ తన వల్లే ఎదిగాడని అన్నారు! ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్య చేశారు.

‘మీ శిష్యులు ఎంతమంది సంగీత దర్శకులు అయ్యారు?’ అని అలీ అడగ్గా.. “చాలామంది ఉన్నారు. హేరిస్‌ జయరాజ్‌, దేవీశ్రీ ప్రసాద్‌, తమన్‌.. వీళ్లందరూ నా దగ్గర చేసినవాళ్లే. దేవీ శ్రీ ప్రసాద్‌ను సింగర్‌ చేసింది కూడా నేనే అనుకుంటా. వీళ్లందరిలో జీరో నుంచి వచ్చిన వ్యక్తి మాత్రం తమన్‌. తన సహనమే అతడిని ఇంతవాడిని చేసింది. నా దగ్గర ఉన్నప్పుడు పని ఒత్తిడిలో నేను ఏది ఉంటే అది విసిరేసేవాడిని. టీవీ వెనక్కి వెళ్లి దాక్కునేవాడు. ఇక శివమణి ఏది దొరికితే దానితో వాయించేస్తాడు. ఫ్లైట్‌ ఎక్కినప్పుడు చేతిలో స్టిక్స్‌ ఉంటే వాటితోనే అద్భుతం చేస్తాడు. ప్లైట్‌ ఎక్కినవాళ్లందరూ క్లాప్స్‌ కొట్టేవాళ్లు.” అని పేర్కొన్నారు.

దీంతో పాటే మరి కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.’మీ దగ్గరకు తమన్‌ వస్తుంటే చాలా మంది తనని తీసుకోవద్దని ఫోన్‌చేసి చెప్పేవారట?’.. పెద్ద పెద్ద మ్యూజిషియన్స్‌ కొందరు భయపడ్డారు. ఎవరితో ఎలా పనిచేయించుకోవాలో నాకు తెలుసు. వాళ్లపేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ, నేను ఎలా పని చేస్తాను అని నాకు మాత్రమే తెలుసు అని చెప్పారు.’తమన్‌ వచ్చాక మణిశర్మ అవసరం లేదనుకునే వాళ్లకి మీ సమాధానం ఏంటి?’.. “నాకు తెలీదు. అది టైమింగ్‌ అంతే. అన్ని సినిమాలు నేనొక్కడినే చేయాలి అనుకోను. నాతో పాటు అందరూ చేయాలనుకుంటాను. అలా చేస్తేనే జనాలకు కూడా కొత్తదనం అందుతుంది. అలా మాత్రమే ఆలోచిస్తా. బహుశా వాళ్లకి బోర్‌ కొట్టిందేమో నా సంగీతం.” అని పేర్కొన్నారు.

ఏఆర్​ రెహమాన్​తో ఉన్న స్నేహబంధం గురించి మాట్లాడుతూ.. రెహమాన్‌ నన్ను ‘ఓయ్‌’ అని పిలుస్తారు. నాకు పాటలు పాడడం కూడా నేర్చుకోమని సలహా ఇచ్చారు. మేమిద్దరం కలిసి చాలా సినిమాలకు పనిచేశాం. రెహమాన్‌ నాకంటే గొప్ప ప్లేయర్‌. అందులో ఏ సందేహం లేదు. అప్పుడప్పుడు కలుస్తుంటాం. ఏదైనా అవసరం అయితే మెసేజ్‌ చేస్తా. చూసుకొని ఫోన్‌ చేస్తారు. తనకు ఆస్కార్‌ వచ్చినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. తను ఆస్కార్‌కు అర్హుడు. ఇప్పటి వరకు ఎంతమంది దగ్గర వర్క్‌ చేశానో లెక్కపెట్టలేదు. కీరవాణి గారికి 100 సినిమాల దాకా పనిచేసి ఉంటా.

నేను సంగీత దర్శకుడిని అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. నన్ను ఆర్జీవీ బలవంతంగా దర్శకుడు అయ్యేలా చేశారు(నవ్వుతూ).” అని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news