ప్రయాణికులు డబ్బులివ్వలేదని కొంతమంది బిచ్చగాళ్లు రైల్లో పాములు వదిలారు. దీంతో రైల్లో ఉన్న ప్రయాణికులు హడలిపోయారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లో చోటుచేసుకుంది. అసలు వాళ్లలా ఎందుకు చేశారంటే..?
హావ్డా నుంచి గ్వాలియర్ వెళ్తున్న చంబల్ ఎక్స్ప్రెస్ శనివారం రోజున ఉత్తర్ప్రదేశ్లో ఉన్న సమయంలో జరిగింది ఈ ఘటన. రైలు ఆగిన సమయంలో యూపీలోని మహోబా జిల్లా మలక్పుర గ్రామం వద్ద.. పాములున్న బుట్టలతో నలుగురు వ్యక్తులు రైలెక్కారు. పాములు ఆడించినా ప్రయాణికులు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో యాచకులు పాములను రైల్లోకి వదిలారు. యాచకులు చేసిన పనికి ప్రాణభయంతో కొందరు బెర్తులపైకి ఎక్కారు. మరికొందరు మరుగుదొడ్లలోకి వెళ్లి డోర్ పెట్టుకున్నారు. దాదాపు 30 నిమిషాలకు పైగా రైల్లో భయానక వాతావరణం నెలకొంది.
ఘటనపై కొందరు ప్రయాణికులు మహోబా రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన యాచకులు.. పాములను తిరిగి బంధించి, స్టేషను రాకముందే రైలు దిగి పరారయ్యారు. పోలీసు తనిఖీల అనంతరం రైలు తిరిగి గ్వాలియర్కు బయలుదేరింది.