ఎందుకు జులై 25నే రాష్ట్రపతుల ప్రమాణ స్వీకారం.. 45 ఏళ్లుగా వస్తున్న ఆచారం..!

-

నూత‌న రాష్ట్రప‌తిగా అప్ర‌తిహ‌త విజ‌యం సాధించిన గిరిజ‌న మ‌హిళ‌ ద్రౌప‌ది ముర్ము జులై 25న దేశ ప్ర‌థ‌మ పౌరురాలి పీఠంపై కొలువుదీర‌నున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ ఆమెతో ప్ర‌మాణ స్వీకారం చేయించ‌నున్నారు. దీంతో ఆమె జులై 25న రాష్ట్రప‌తిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన 10వ వ్య‌క్తిగా నిల‌వ‌నున్నారు. దేశ ఆర‌వ రాష్ట్రప‌తి నీలం సంజీవ‌య్య 1977లో మొట్ట‌మొద‌టి సారిగా జులై 25న రాష్ట్రప‌తి ప‌ద‌విని అలంక‌రించిన వ్య‌క్తిగా నిలిచారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఇదే ఆన‌వాయితీ కొన‌సాగుతోంది.

జులై 25నే ప్ర‌మాణ స్వీకారం ఎందుకు?

1950 జనవరి 26న డా.బాబు రాజేంద్రప్రసాద్‌ దేశ ప్రథమ పౌరుడిగా ప్రమాణం చేశారు. ఆ త‌రువాత ఆయ‌న రెండు ప‌ర్యాయాలు ఎన్నిక‌య్యారు. అనంతరం 1962లో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ అత్యుత్త‌మ ప‌ద‌విని అలంక‌రించారు. ఆయ‌న త‌రువాత రాష్ట్రప‌తిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన డా.జాకీర్ హుస్సేన్‌, వీవీ గిరి, ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌లు పూర్తి కాలం ప‌దవీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌లేక‌పోయారు.

అనంతరం నీలం సంజీవరెడ్డి 1977 జులై 25న రాష్ట్రపతిగా ప‌దవీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. విజ‌య‌వంతంగా ఐదేళ్ల ప‌ద‌వీ కాలాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత రాష్ట్రప‌తులుగా మారిన ప్ర‌తి ఒక్క‌రూ తమ పదవీ కాలాన్ని జ‌య‌ప్ర‌దంగా ముగించారు. జులై 25న బాధ్యతలు స్వీకరించడం.. స‌రిగ్గా ఐదేళ్ల తర్వాత జులై 24న పదవీ విమరణ చేయడం ఆనవాయితీగా వ‌స్తోంది. గత 45 ఏళ్లుగా ఇదే తంతు కొన‌సాగుతోంది. దీంతో ద్రౌపదీ ముర్ము కూడా జులై 25నే ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news