కరోనా బారిన పడ్డ రాజకీయ ప్రముఖులు వీరే…!

-

కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ…. చిన్న చిన్న లీడర్ల నుంచి ఉపరాష్ట్రపతి వరకు… అంతా కరోనా బారినపడుతున్నారు. అన్‌లాక్‌ మొదలైనప్పటినీ నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వచ్చింది. కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులకు కరోనా సోకింది. పలువురు ప్రజాప్రతినిధుల ప్రాణాలను సైతం బలితీసుకుంది మహమ్మారి.

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు అమిత్‌షా, గడ్కరీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, కర్నాటక సీఎం యడియూరప్పా….. ఇలా ఎవరూ కరోనాకు అతీతం కాదని తేలిపోయింది. వీరంతా కరోనా బారినపడ్డవారే. వీరితో పాటు ఇంకా చాలా మంది ప్రజాప్రతినిథులకు కరోనా సోకింది. మరికొందరి ప్రాణాలు తీసింది. నిత్యం ఇద్దరు ముగ్గురు వీఐపీలు కరోనా బారిన పడుతూనే ఉన్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కరోనా సోకింది. కేంద్రహోం మంత్రి అమిత్‌షాకు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. కరోనా లక్షణాలు కన్పించడంతో పరీక్షలు చేయించుకున్నారు. దీంతో పాజిటివ్ వచ్చింది. డాక్టర్ల సూచన మేరుకు ఆస్పత్రిలో చేరారు. కరోనా నుంచి కోలుకున్నా…ఇంకా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. దీంతో ఇటీవలే ఎయిమ్స్‌లో రెండురోజులు చికిత్సపొందారు. తర్వాత మళ్లీ డిశ్చార్జ్‌ అయ్యారు.

కేంద్ర మంత్రి గడ్కరీ కూడా కరోనాను జయించారు. పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కు కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన 15 రోజులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మరో ఇద్దరు కేంద్రమంత్రులు అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌, కైలాశ్ చౌదరికి పాజిటివ్‌ రావడంతో… వారు చికిత్స తీసుకొని బయటపడ్డారు.

కరోనా మహమ్మారి.. కేంద్రమంత్రిని, పలువురు రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలను పొట్టనపెట్టుకుంది. కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగాడి కరోనాతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో చనిపోయిన తొలి కేంద్రమంత్రి ఈయనే. యూపీ సాంకేతిక విద్యా శాఖ మంత్రి కమల్‌రాణిని కరోనా పొట్టన పెట్టుకుంది. లక్నోలోని ఆసుపత్రిలో కన్నుమూశారు. ఏపీలో మాజీ దేవాదాయ శాఖమంత్రి, బీజేపీ సీనియర్ నేత మాణిక్యాలరావు కరోనాతో చనిపోయారు.

తెలుగు రాష్ట్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనాబారిన పడ్డారు. తెలంగాణ మంత్రులు హరీష్‌రావు, మల్లారెడ్డి, మహమూద్‌ అలీ, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు వీరంతా కరోనాను జయించినవారే. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలుకు సైతం కరోనా వచ్చింది. ఏపీలో సరిగా నెల రోజుల కిందట ఇద్దరు మంత్రులకు కరోనా సోకింది. ఒకేరోజు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, వేణుగోపాలకృష్ణకు పాజిటివ్‌ తేలడంతో… హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి కరోనానుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.చివరకు పార్లమెంట్‌, అసెంబ్లీ సమావేశాలపైనా కరోనా ప్రభావం చూపించింది. వైరస్‌ దెబ్బకు…సమావేశాలను అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news