కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ వ‌రాలు

-

  •  మంత్రి మండలి ఉపసంఘం నిర్ణయం
  •  వైద్య, ఆరోగ్య శాఖ, విద్యాశాఖలోని బోధనా సిబ్బందికి వర్తింపు
  •  30 వేల మందికి లబ్ది
  •  180 రోజుల మెటర్నటీ సెలవులు
  •  అధ్యాపకులకు 10 రోజుల బ్రేక్‌తో 12 నెలల జీతం
  •  పదవీ విరమణ వయసు 58 నుంచి 60కి పెంపు
  •  అందరికీ ఉద్యోగ భద్రత
  •  అన్ని శాఖలలోని కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ఒకే విధానం ఆలోచన

అమ‌రావ‌తి: కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్(ఎంటీసీ) ఇవ్వాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన సచివాలయంలోని ఆర్థిక మంత్రి ఛాంబర్‌లో గురువారం ఉదయం సమావేశమైన మంత్రి మండలి ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వైద్య, ఆరోగ్య శాఖలోని సిబ్బందికి, ఉన్నత విద్యాశాఖలోని విశ్వవిద్యాలయ, డిగ్రీ, జూనియర్ కాలేజీలలో పని చేసే అధ్యాపకులకు మాత్రమే వర్తిస్తుంది. ఉప సంఘం తీసుకున్న నిర్ణయాల ప్రకారం మహిళలకు 180 రోజులు మెటర్నటీ సెలవులు ఇస్తారు. ప్రభుత్వంలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచుతారు. అధ్యాపకులకు ప్రస్తుతం పది నెలలకు మాత్రమే జీతం ఇస్తున్నారు. దానిని 12 నెలలకు పెంచుతారు. అయితే ప్రతి ఏడాది పది రోజులు బ్రేక్ ఇస్తారు.

అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తారు. ఈ రోజు తీసుకున్న కీలక నిర్ణయాల వల్ల వైద్య, ఆరోగ్య శాఖలో 23,372 మందికి, ఉన్నత విద్యా శాఖలో 3,802 మందికి లబ్డి చేకూరుతుంది. అందరికీ డీఏ లేకుండా ఎంటీసీ వర్తిస్తుంది. ఈ నిర్ణయం వల్ల ఉన్నత విద్యాశాఖపై రూ.38 కోట్ల అదనపు భారం పడుతుంది. అయితే వివిధ శాఖలలో పని చేసే కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ఒకే విధానం అనుసరించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించమని మంత్రి యనమల అధికారులను ఆదేశించారు. ఆంధ్రా యూనివర్సిటీలోని 28 రోజుల ఉద్యోగులు, ఎన్ఎంఆర్ ల సమస్యల గురించి కూడా సమావేశంలో చర్చించారు. సమావేశంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఎన్ఎండీ ఫరూక్, ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.రవిచంద్ర, ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి బి.ఉదయలక్ష్మి, కాలేజ్ ఎడ్యుకేషన్ ప్రత్యేక కమిషనర్ సుజాత శర్మ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news