చంద్రబాబుకి ఆరోగ్య శ్రీలో వైద్యం లేదు…!

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేసారు. కర్నూలు జిల్లాలో కంటి వెలుగు మూడో దశ కార్యక్రమం ప్రారంభించిన జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు కి ఆరోగ్య శ్రీలో వైద్యం లేదన్నారు జగన్. నాడు నేడు కార్యక్రమంలో మార్పు మూడేళ్ళలో చూడవచ్చు జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఆస్పత్రుల రూపు రేఖలను మార్చడానికి నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు జగన్. మార్చ్ 1 నుంచి అవ్వా తాతలకు ఉచితంగా, ఆపరేషన్లు, కంటి పరిక్షలు చేయిస్తామని హామీ ఇచ్చిన జగన్, కళ్ళ జోళ్ళు ఎవరికి అయితే అవసరమవుతాయో వారికి ఉచితంగా గ్రామ వాలంటీర్ వచ్చి, మీ ఇంటి వద్దకే వచ్చి ప్రతీ అవ్వా తాతా చేతిలో పెడతాడని హామీ ఇస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబుపై విమర్శలు చేసారు. ఇంత మంచి పరిపాలన జరుగుతున్నప్పుడు అసూయ, ఈర్ష్య ఉండటం సాధారణమన్న ఆయన, తనపై చంద్రబాబు నాయుడు, విపక్షాలు ఏ విధంగా విమర్శలు చేస్తున్నారో మీరు అంతా చూస్తున్నారని, ఆరోగ్య శ్రీ లో క్యాన్సర్ కి మందు ఉంది గాని ఈర్ష్య తో వచ్చిన కడుపు మంటకి వైద్యం లేదని, చూపు మందగిస్తే కంటి వెలుగులో చికిత్స ఉంది గాని, చెడు దృష్టికి ఎక్కడా కూడా చికిత్స లేనే లేదన్నారు.

అలాగే వయసు మళ్ళితే చికిత్సలు ఉన్నాయి గాని మెదడు కుళ్ళితే చికిత్సలు లేనే లేవని ఎద్దేవా చేసారు. ఇలాంటి లక్షణాలు ఉన్న మనుషులను మహానుభావులు గా చూపించే కొంత మంది చానల్స్ ఉన్నాయని, కొన్ని పత్రికలూ ఉన్నాయని, వాళ్ళను బాగు చేసే మందులు కూడా ఎక్కడ లేవని ఎద్దేవా చేసారు. వీటి అన్నింటి మధ్య మీ బిడ్డ మీ కోసం పని చేస్తూ ఉన్నాడని జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news