సిట్టింగులకు సీట్ల సవాల్..కేసీఆర్ గజ్వేల్ వదిలేస్తారా?

-

బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం అద్భుతంగా నడుస్తుంది…కే‌సి‌ఆర్ బాగా పాలిస్తున్నారు..మళ్ళీ బి‌ఆర్‌ఎస్ పార్టీని గెలిపించడానికి రెడీగా ఉన్నారు. ఈ సారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బి‌ఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. అయితే నిజంగా కే‌సి‌ఆర్ పాలన అద్భుతంగా ఉంటే..అభ్యర్ధులు ఎవరు ఉన్న సరే గెలిచేస్తారు కాబట్టి..సిట్టింగుల అందరికీ సీట్లు ఇవ్వాలని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు.

అప్పుడు ఎవరు సత్తా ఏంటో తేలిపోతుందని అంటున్నారు. 104 మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు ఇవ్వాలని, కేసీఆర్‌ గజ్వేల్‌ నుంచే పోటీ చేయాలని రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. గజ్వేల్‌లో కేసీఆర్‌, 104 మంది ఎమ్మెల్యేల్లో 80 శాతం మంది ఓడిపోతున్నట్లు సర్వే ల్లో తేలిందని, అందుకే కేసీఆర్‌ పక్క నియోజకవర్గాలు వెతుక్కుంటున్నారని అన్నారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో తెలియదు గాని..కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం…వారిని మార్చాలని కే‌సి‌ఆర్ చూస్తున్నారు. కాకపోతే ఇప్పటికే సిట్టింగులకు దాదాపు సీట్లు ఇస్తామని, కానీ ఎవరైతే సరిగ్గా పనిచేయరో వారిని  మాత్రం పక్కన పెట్టేస్తామని అన్నారు.

అయితే అంతర్గతంగా అందుతున్న సర్వేల ప్రకారం దాదాపు 30 వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తెలుస్తుంది. ఇక వారికి సీట్లు ఇచ్చే విషయంలో కే‌సి‌ఆర్ ఆలోచనలో ఉన్నారని తెలిసింది. కాకపోతే అంతమందికి ఒకేసారి సీట్లు ఇవ్వకపోయినా ఇబ్బందే కాబట్టి..కే‌సి‌ఆర్ సీట్లు ఇచ్చే విషయంలో ఆచి తూచి ముందుకెళ్లే ఛాన్స్ ఉంది.

అలాగే కే‌సి‌ఆర్ గజ్వేల్ సీటు వదిలేస్తున్నారనే ప్రచారం వస్తుంది. ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ వర్గాల సమాచారం ప్రకారం ఆయన సీటు వదిలే ఛాన్స్ లేదని తెలుస్తుంది. కాకపోతే గెలిచి అధికారంలోకి వస్తే…పార్లమెంట్ ఎన్నికల సమయంలో కే‌సి‌ఆర్..ఎంపీగా పోటీ చేసి..రాష్ట్ర బాధ్యతలని కే‌టి‌ఆర్‌కు అప్పగిస్తారనే ప్రచారం ఉంది. చూడాలి మరి కే‌సి‌ఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

Read more RELATED
Recommended to you

Latest news