ప్రవీణ్‌తో జేడీ..ట్విస్ట్ ఉందా..?

-

ఇద్దరు నేతలు స్వచ్ఛందంగా పదవులకు విరమణ ప్రకటించినవారే. ఇద్దరూ రాజకీయాల్లో ఏదో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నవారే. తమకు సాధ్యమైన మేర ప్రజల్లో ఉంటూ, వారి కష్టాలు తెలుసుకుంటూ, సమాజంలో ఏదో మార్పు తీసుకురావాలని చెప్పి అటు ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్, ఇటు జేడీ లక్ష్మీనారాయణ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇంకా తమ పదవి విరమణకు సమయం ఉన్నా సరే…మధ్యలోనే పదవులు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు.

ఇక జేడీ గత ఎన్నికల ముందే ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే 2019 ఎన్నికల ముందు జనసేనలో చేరి…విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జేడీ..అనూహ్యంగా పలు కారణాల వల్ల జనసేనకు దూరమయ్యారు. పవన్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉండకపోవడం, జనసేన బలోపేతం చేయకపోవడంతో జేడీ పార్టీ వీడారు. ఇక ఇండిపెండెంట్ గానే ఆయన రాజకీయం చేస్తూ వెళుతున్నారు. ప్రజల మధ్యలో తిరుగుతున్నారు.

ఇక ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణకు చెందిన అధికారి. ఆయన కూడా మధ్యలోనే పదవి వదిలిపెట్టి.. బి‌ఎస్‌పిలో చేరి తెలంగాణలో రాజకీయం చేస్తున్నారు. బి‌ఎస్‌పి బలోపేతానికి కృషి చేస్తున్నారు. కొద్దో గొప్పో తెలంగాణలో బి‌ఎస్‌పికి బలం ఉంది. ఆ బలాన్ని మరింత పెంచాలని చుస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా బహుజన రాజ్యాధికార యాత్ర చేస్తున్న ప్రవీణ్‌కు..జేడీ మద్ధతు పలికారు. చౌటుప్పల్‌లో యాత్ర చేస్తున్న ప్రవీణ్‌ని కలిశారు. దీనికి సంబంధించి ప్రవీణ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి, జేడీకి ధన్యవాదాలు తెలిపారు.

అయితే ఇప్పుడు వీరిద్దరు కలయిక రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. జేడీ కూడా బి‌ఎస్‌పి లో చేరి..ఏపీలో కీలకంగా వ్యవహరించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో బి‌ఎస్‌పి..జనసేనతో కలిసి పొత్తులో పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయింది. ఏపీలో ఆ పార్టీకి బలమైన నాయకులు లేరు. ఇప్పుడు జేడీ బి‌ఎస్‌పిలోకి వస్తే..కాస్త పరిస్తితులు మారే ఛాన్స్ ఉంది. మరి ప్రవీణ్-జేడీ కాంబో సెట్ అవుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news