రసవత్తరంగా ఇల్లందు పోరు..కనకయ్య వర్సెస్ హరిప్రియ!

-

తెలంగాణలో రాజకీయం హాట్ హాట్ సాగుతుంది. బి‌ఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు పోరు నడుస్తుంది. ఇటీవల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్తితి మారింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి లీడ్ కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో కొన్ని సీట్లు పొంగులేటి వర్గానికి దక్కనున్నాయి.

ఈ క్రమంలోనే ఇల్లందు సీటు పొంగులేటి వర్గంలో ఉన్న కోరం కనకయ్యకు దక్కుతుందని టాక్. దీంతో ఇల్లందు పోరు రసవత్తరంగా సాగేలా ఉంది. ఎమ్మెల్యే హరిప్రియ, కనకయ్య మధ్య పోరు జరిగేలా ఉంది. మరి వీరిలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తిగా మారింది. మామూలుగా ఇల్లందు కమ్యూనిస్టుల కంచుకోట. అందులోనూ గుమ్మడి నర్సయ్య అడ్డా.

మొత్తం 9 సార్లు ఇక్కడ కమ్యూనిస్టులు గెలిచారు. ఇక అందులో గుమ్మడి నర్సయ్య అయిదుసార్లు గెలిచారు. అయితే 2009 నుంచి కాస్త పరిస్తితి మారింది. 2009లో ఇక్కడ టి‌డి‌పి గెలిచింది. అది కూడా కమ్యూనిస్టుల మద్ధతుతోనే గెలిచింది. 2014లో కాంగ్రెస్ నుంచి కోరం కనకయ్య గెలిచారు. ఆయన కూడా కమ్యూనిస్టుల మద్ధతుతోనే గెలిచారు. తర్వాత ఆయన బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్లారు. దీంతో 2018 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ నుంచి కోరం, కాంగ్రెస్ నుంచి బానొత్ హరిప్రియ పోటీ చేశారు. విజయం హరిప్రియకు దక్కింది.

ఆ తర్వాత హరిప్రియ కూడా బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. ఇటు కోరం ఏమో జెడ్పీ ఛైర్మన్ అయ్యారు. అయితే ఈ ఇద్దరి మధ్య పోరు నడుస్తుంది. నెక్స్ట్ కనకయ్యకు సీటు డౌట్. దీంతో పొంగులేటితో కలిసి కోరం కాంగ్రెస్ లోకి వచ్చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బరిలో దిగడానికి కోరం రెడీ అవుతున్నారు. అటు హరిప్రియ బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తారు. వీరి మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. ఇక్కడ కమ్యూనిస్టుల మద్ధతు కీలకం.

ప్రస్తుతం కమ్యూనిస్టులు..బి‌ఆర్‌ఎస్ వైపు ఉన్నారు. దీంతో బి‌ఆర్‌ఎస్‌కు కాస్త అడ్వాంటేజ్. అలా అని కాంగ్రెస్ బలం తక్కువ కాదు. చూడాలి మరి ఈ సారి ఇల్లందులో ఎవరు పై చేయి సాధిస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news