చంద్రబాబు మచ్చలేని వ్యక్తి… ఇదే లాజిక్!

-

రాజకీయాల్లో మచ్చలు లేకపోవడం అనేది ఈ రోజుల్లో సాధ్యమేనా? గతంలో పుచ్చలపల్లి సుందరయ్య, టంగుటూరి ప్రకాశంపంతులు వంటివారికి సాధ్యమై ఉండొచ్చు తప్ప అనంతర కాలంలో ఆ ఛాన్స్ లేదనే చెప్పాలి! కానీ… నేడు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మచ్చలేని వ్యక్తే అని చెబుతున్నారు టీడీపీ నేతలు. అవును… 40ఏళ్ల రాజకీయ జీవితంలో బాబుకు ఎలాంటి మచ్చా లేదని, రాజకీయంగా ఏమాత్రం మకిలి అంటని నేతని వాదిస్తున్నారు. ఇంతకూ ఈ సాహసోపేతమైన కామెంట్ చేయడానికి వారు తీస్తున్న లాజిక్ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం!

టీడీపీ అధినేత చంద్రబాబు మచ్చలేని వ్యక్తి అని.. ఏనాడూ కోర్టు గడపకూడా తొక్కలేదని చెబుతున్నారు టీడీపీ నేత పంచుమర్తి అనురాధ! అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొనేందుకు భయపడే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని ఎన్నో ఆరోపణలు వచ్చిన సంగతి మరిచారో ఏమో కానీ… అనురాధ ఈ సాహసానికి ఒడిగట్టారు! అక్రమ ఆస్తుల విషయంలో సీబీఐ విచారణ పూర్తయితే దోషిగా నిలబడాల్సి వస్తుందనే భయంతోనే చంద్రబాబు హైకోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారని గతంలో బాబుపై ఎన్నో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

కాగా… గతంలో తనపై వేసిన అనేక కేసుల్లో కోర్టుకెక్కి స్టేలు తెచ్చుకోవడం బాబుకు పరిపాటిగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకోవడంలో చంద్రబాబుకు డాక్టరేట్ ఇవ్వచ్చని అప్పట్లో రాజకీయపక్షాలు బాబును ఎద్దేవా చేసేవి కూడా! ఇదే విషయాలపై ప్రస్తుత తెలంగాణ మంత్రి కేటీఆర్ గతంలో బాబు స్టేల వ్యవహారంపై స్పందిస్తూ… 18 కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నారని, దొంగతనం చేసిన వాడు బయపడాలి కానీ, దొంగతనం చేయనివాడికి భయం ఎందుకు.. స్టే తెచ్చుకోవడం ఎందుకు అని సెటైర్లు వేశారు. కానీ… నాడు ఈ కామెంట్లపై బాబు & కో స్పందించిన దాఖలాలు లేవు!

ఈ విషయాలు అన్నీ వారు మరిచారో లేక జనం మరిచారని తలచారో తెలియదు కానీ… ఏనాడూ కోర్టు మెట్టు ఎక్కలేదు కాబట్టి తమ అధినేత చంద్రబాబు మచ్చలేని వ్యక్తి అని టీడీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news