రెండోసారి గెలిచినా ఆ వైసీపీ ఎమ్మెల్యే ది ఎదురీతేనా !

-

రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలోని కేడర్ పై ఎమ్మెల్యేకి పట్టు పెరగాలి..కానీ ఇక్కడ రివర్స్ లో ఎమ్మెల్యే ముందే పెతాపాలకు పోతారు పార్టీ నాయకులు. ఇదేంటని గట్టిగా నిలదీస్తే మీదో వర్గం.. మాదో వర్గం అని ముఖం మీదే చెప్పేస్తారు. చివరకు ఎమ్మెల్యే మీద సీఎంకి ఫిర్యాదు చేసే వరకు వెళ్లిందీ ఈ వ్యవహారం. చింతల రామచంద్రరెడ్డి. చిత్తూరు జిల్లా పీలేరు నుంచి వరసగా రెండోసారి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకప్పుడు నియోజకవర్గంలో కేడర్‌కు ఆయనంటే క్రేజ్‌. ఇప్పుడు అదే కేడర్‌ చేస్తోన్న పనులతో తలపట్టుకుంటున్నారట చింతల.

పీలేరులో ప్రస్తుతం గ్రామస్థాయిలో ఏ కార్యక్రమం జరిగినా కేడర్‌ రెండు మూడు గ్రూపులుగా విడిపోయి నిర్వహిస్తున్నాయి. ఇటీవల గుర్రంకొండలో నిర్వహించిన సంఘీభావ పాదయాత్ర సభలో ఎమ్మెల్యే ఎదుటే కార్యకర్తలు బలప్రదర్శనకు దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అని ఆవేశాలకు పోయారు. చివరకు ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటే గానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. అప్పట్లో పీలేరులో ఎమ్మెల్యే ఏం చెబితే అదే జరిగేది. కేడర్‌ కూడా ఆయన మాట జవదాటేది కాదు. 2019 తర్వాత పరిస్థితులు మారిపోవడంతో నియోజకవర్గంలో ఎదురీదుతున్నట్టు పార్టీలో గుసగసలాడుకుంటున్నారట.

పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని కాకుండా బయట పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం వల్లే క్షేత్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. పీలేరులో భూ ఆక్రమణలపై పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నా ఎమ్మెల్యే చింతల పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీలేరు మండలంలోనే వందల ఎకరాల డీకేటీ భూములను వెంచర్లుగా వేసి అమ్మేశారు. దీనిపై ఓ మైనారిటీ నాయకుడు సీఎం జగన్‌కు ఫిర్యాదు చేయడం వైసీపీలో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఈ పని ఎంపీ మిథున్‌రెడ్డి అనుచరులు చేశారని ఎమ్మెల్యే వర్గం.. చింతల మనుషులే చేశారని ఎంపీ వర్గం ఆరోపించుకుంటున్నాయట.

కలికిరి, కలకడ, పీలేరు, కేవీపల్లి మండలాల్లో వర్గపోరును ఎమ్మెల్యే చింతల తట్టుకోలేకపోతున్నారట. ఇక్కడి వర్గపోరువల్లే ఎమ్మెల్యే అన్ని మండలాలకు వెళ్లడానికి జంకుతున్నారట. పదే పదే రెండు మూడు మండలాల్లో పర్యటిస్తున్నట్టు సమాచారం. పైగా నియోజకవర్గంలోని బీసీలు, మైనారిటీలు అధికార పార్టీ నేతలపై గుర్రుగా ఉన్నారట. ఇదే విషయాన్ని స్థానిక నాయకులు జిల్లా మంత్రి, ఎంపీల దృష్టికి తీసుకెళ్లారట. అయినా ఎలాంటి మార్పు రాలేదని చెబుతున్నారు.

చిత్తూరు జిల్లా పీలేరు అంటే నల్లారి కుటుంబానికి బాగా పట్టున్న ప్రాంతం. అలాంటి చోట వైసీపీ పాగా వేసినా.. కేడర్‌ గ్రూపులుగా విడిపోవడం.. ఎమ్మెల్యే చెప్పినా ఎవరూ వినకపోవడం పార్టీ పెద్దలను కలవర పెడుతోందట.

Read more RELATED
Recommended to you

Latest news