మద్యం మత్తులో టీఆర్ఎస్ కార్పొరేటర్ వీరంగం..!

-

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్టలో డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్.. బీజేపీ జనరల్ సెక్రటరీపై దాడికి దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న 126 డివిజన్ కార్పొరేటర్ జగన్ వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో స్థానిక డివిజన్ బీజేపీ జనరల్ సెక్రటరీ వసుంధర బంధువు నమస్కారం చేయలేదని గొడవకు దిగాడు. జగన్ తో పాటు ఆయన అనుచరులు మహిళలను సైతం చూడకుండా బీజేపీ కార్యకర్తలపై దాడికి దిగారు. అడ్డుకునేందుకు వచ్చిన వసుంధరపై సైతం పిడి గుద్దులు గుప్పించారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.

ఈ మేరకు ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. బీజేపీ డివిజన్ జనరల్ సెక్రటరీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు.. ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో కార్పొరేటర్ జగన్, అతని అభిమానులు వచ్చారని, అప్పుడే డివిజన్ బీజేపీ జనరల్ సెక్రటరీ వసుంధర కుటుంబ సభ్యులను చూసి.. నమస్కారం ఎందుకు పెట్టడం లేదని గొడవకు దిగారన్నారు. నమస్కారం ఎందుకు పెట్టాలని చెప్పినందుకు కొట్టడం మొదలుపెట్టారన్నారు. తాగినమైకంలో గొడవ తీవ్ర రూపం దాల్చిందన్నారు. అడ్డుకోవడానికి వచ్చినవాళ్లను సైతం చితకబాదారన్నారు.

గొడవకు సంబంధించిన పూర్తి ఆధారాలతో వీడియో తీశామన్నారు. కార్పొరేటర్ జగన్, అతని అభిమానులు మహిళలను చూడకుండా కడుపులో గుద్దారని.. వారిని కఠినంగా శిక్షించాలని బాధిత మహిళలు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు గొడవకు సంబంధించిన వీడియోను తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉందని.. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news