ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికి కూడా వ్యాక్సిన్‌

-

తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రతరమవుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ జనాభాతో పాటు ఇతర రాష్ట్రాల నుండి రాష్ట్రానికి వచ్చి అనేక సెక్టార్లలో పనిచేస్తున్న జనాభా కలుపుకుని, రాష్ట్రంలో సుమారు నాలుగు కోట్లమంది దాకా ప్రజలు ఉన్నారని, వీరిలో ఇప్పటికే 35 లక్షల మందికి పైగా వ్యక్తులకు టీకా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇక మిగతా అందరికీ వయసుతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, వైద్యశాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసారు. వ్యాక్సినేషన్‌ కోసం సుమారు 2500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని, ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదని సీఎం పేర్కొన్నారు.

ఇప్పటికే భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌ తయారీ చేస్తుందని, రెడ్డి ల్యాబ్స్ తో సహా మరికొన్ని సంస్థలు వ్యాక్సినేషన్‌ తయారీకి ముందుకు వచ్చాయని, కాబట్టి వ్యాక్సినేషన్‌ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రెండు-మూడు రోజుల్లో తనకు అవసరమైన వైద్య పరీక్షలు జరిగి, పూర్తి స్వస్థత చేకూరిన తరువాత సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పటిష్టంగా, విజయవంతంగా అమలు చేయడానికి జిల్లాల వారీగా ఇంఛార్జ్ లను నియమించనున్నట్లు తెలిపారు.

వ్యాక్సినేషన్‌ కార్యక్రమంతో పాటు, రెమిడిసివిర్ తదితర కరోనా సంబంధిత మందులకు, ఆక్సిజన్ కు ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు ఏ విధమైన భయభ్రాంతులకు గురికావద్దని, పడకల విషయంలోనూ, మందుల విషయంలోనూ ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తుందని, ప్రజలను కోవిడ్ బారి నుండి కాపాడడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news