ఏపీ పీసీసీకి కొత్త బాస్‌….! రాజ్య‌స‌భ బాట‌లో ష‌ర్మిల‌…!!

-

జాతీయ కాంగ్రెస్ పార్టీ ప‌లు రాష్ర్ట్టాల్లో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది.ఈ క్ర‌మంలోనే ఎనిమిది రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్ లను మార్చాలని నిర్ణయించింది కాంగ్రెస్‌ హైకమాండ్. దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై చర్చించడంతోపాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయో స‌మీక్షించేందుకు ఏఐసీసీ పెద్ద‌లు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు.మంగ‌ళ‌వారం నిర్వ‌హించనున్న‌ కీలకమైన సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతోపాటు ఆయా రాష్ట్రాల ఇంచార్జ్ లు, సీనియర్ నేతలు హజరు కానున్నారు.

పీసీసీ చీఫ్‌ల మార్పుపై ఈ స‌మావేశంలో ఏఐసీసీ పెద్ద‌లు నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్ప‌టికే ప్ర‌స్తుత పీసీసీ అధ్య‌క్షుల‌కు స‌మాచారం అందించారు. మార్పు మంచిదే అన్న కోణంలో వారు కూడా స‌రేన‌న్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో ఏపీ పీసీసీ చీఫ్ మార్పు కూడా జ‌ర‌గొచ్చ‌ని ప్ర‌చారం న‌డుస్తోంది. ష‌ర్మిల‌ను రాజ్య‌స‌భ‌కు పంపి కొత్త అధ్య‌క్షుడిని నియమిస్తార‌ని అంటున్నారు. ఆ కొత్త బాస్ ఎవ‌రా అని ఏపీలోని కాంగ్రెస్ పార్టీ నేత‌లు సైతం చ‌ర్చించుకుంటున్నారు.

కొన్ని నెల‌ల్లో మహారాష్ట్ర, జార్ఖండ్ , హర్యానాతోపాటు జమ్మూ కాశ్మీర్ రాష్ర్టాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ర్టాల్లో ఇప్ప‌టికే ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం నెల‌కొంది. వచ్చే ఏడాది చివర్లో ఎన్నిక‌ల‌కు బీహార్ కూడా సిద్ధ‌మ‌వుతోంది. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికలపై మంగ‌ళ‌వారం సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఎన్నికలకు పొత్తులతో వెళ్లడమా? లేక ఒంటరిగానే ముందుకు వెళ్లడమా అనే అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు.. గత కొద్ది నెలలుగా పీసీసీల మార్పుపై అధిష్టానం కసరత్తు చేస్తున్నా ఓ కొలిక్కి రావడం లేదు.

మరికొంతకాలం జాప్యం చేస్తే ఆయా రాష్ట్రాల్లో క్యాడర్ కు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. దీంతో పీసీసీల మార్పుపై త‌క్ష‌ణ‌మే నిర్ణ‌యం తీసుకుని ఆయా రాష్ట్రాలకు కొత్త సారథులను నియమించాలని హైకమాండ్ ఫైన‌ల్ నిర్ణ‌యానికి వ‌చ్చేసింది. ఈ స‌మావేశంలో ఏకాభిప్రాయం కుదిరితే ఏడు రాష్ట్రాలకు రెండు రోజుల్లో కొత్త‌ పీసీసీ అధ్యక్షుల పేర్లను ఖరారు చేస్తారని తెలుస్తోంది.

తెలంగాణ‌కు కూడా కొత్త పీసీసీ సార‌థిని నియ‌మించాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఆయ‌న విదేశీ పర్యటనలో ఉండ‌టంతో.. టి.పీసీసీ అధ్యక్షుడు ఎవరనేది ఇప్పుడే తేలుస్తారా లేక రేవంత్ వ‌చ్చాక ప్ర‌క‌టిస్తారా అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడి విషయంలో రేవంత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని.. మరోసారి రేవంత్ తో చర్చించి తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ ఎవరనేది ప్రకటించనున్నారని తెలుస్తోంది.

కాగా ఏపీ పీసీసీ కి కొత్త అధ్య‌క్షుడిని నియ‌మించే ఆలోచ‌న‌లో అధిష్టానం ఉంది. మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ష‌ర్మిల‌కు పీసీసీ సార‌థ్య‌బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గ‌ట్టి పోటీ ఇచ్చినా ఒక్క సీటు కూడా గెలుచుకోలేక‌పోయింది. ఆఖ‌రికి ష‌ర్మిల.. కుటుంబ వివాదాల‌ను రాజ‌కీయ అవ‌స‌రాల‌కు వాడుకున్నాలాభం లేకుండా పోయింది. ప్ర‌స్తుతం పీసీసీ అధ్య‌క్షురాలిగా ఉన్న ష‌ర్మిల‌ను క‌ర్నాట‌క నుంచి రాజ్య‌స‌భ‌కు పంపే ఆలోచ‌న‌లో ఏఐసీసీ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించే స‌మావేశంపై ఆస‌క్తి నెల‌కొంది.

Read more RELATED
Recommended to you

Latest news