వైర‌ల్ అవుతున్న ఆర్టీసీ కండక్టర్ రాజీనామ లేఖ…

-

అర్వపల్లి మండలం, సూర్యానాయక్ తండా కు చెందిన లూనావత్ కృష్ణ సూర్యాపేట డిపోకు చెందిన ఉద్యోగి. అయితే లూనావ‌త్ కృష్ణ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆవేద‌న‌తో రాజీనామా లేఖ‌ రాశాడు. అందులో.. గౌరవనీయులైన తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి.. తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఉద్యోగం చేద్దామనుకున్నా.. ఆత్మగౌరవంతో బ్రతుకుదాం అనుకున్నా కానీ మీలాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో కాదు కదా కనీసం తెలంగాణలో ఎందుకు పుట్టాను రా నాయనా అనే విధంగా తీవ్ర మానసిక వేదనకు గురై నేను ఈ నిర్ణయం తీస్కుంటున్నాను. మీకు మాట తప్పడం, మాయమాటలు చెప్పి మోసం చెయ్యడం మా కార్మికలోకం లేట్ గా తెలుసుకుంది. మీరు ఉద్యోగం లో నుండి తీసేయడం కాదు.. నేనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను.

దానికి కారణం లేకపోలేదు సర్. మా తెలంగాణ లో నియంతృత్వం చూస్తా అని అనుకోలేదు. 1200 మంది ఆత్మహత్య చేసుకుంటే మన కేసీఆర్ సర్ ఉన్నారు.. ఆంధ్ర పాలకులు నిజంగా మోసం చేశారేమో, మనల్ని బాగా చూసుకుంటారు అనుకున్న కానీ.. మాలో 30 మంది కార్మికులు చనిపోతే మీరు కనీసం స్పందించలేదు చూడండి సర్ అప్పుడు అనిపించింది తెలంగాణ మా కోసం కాదు తెలంగాణా కేవలం మీ లాంటి నాయకుల కోసమే అని. నా అక్క చెల్లెమ్మలు లాఠీ దెబ్బలు తింటారు అని కలలో కూడా ఉహించలేదు. కానీ మీ బంగారు తెలంగాణ లో అది సాధ్యం అయింది. నా చెల్లెలు ఏడుస్తుంటే తట్టుకోలేక పోతున్న సర్. కానీ ఒక్కటి మాత్రం నిజం నా ఆర్టీసీ అక్క చెల్లెల ఉసురు ఖ‌చ్చితంగా మీకు తగులుతుంది.

నేను సూర్యాపేట డిపో లో ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాను. మీలాంటి ఒక మోసకారి.. ఒక మాటకారి.. ఒక మానవత్వం లేని ఒక నిరంకుశ ప్రభుత్వంలో నా ఆత్మభిమన్నాన్ని చంపుకొని ఉద్యోగిగా పని చేయలేను. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్న. నా పేరు యల్.కృష్ణ, నా స్టాప్ నెంబర్ 176822. సూర్యాపేట డిపో సర్. నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. మీ సంస్థ నుండి నాకు రావాలిసిన బకాయిలను ఇప్పించి నా రాజీనామాను ఆమోదించగలరని నా యొక్క మనవి. అయ్యా సీఎం సర్ మీరు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు మీ వైఖరి గుర్తు చేసుకోండి. పాపం సర్ ఆర్టీసీ వాళ్ళు మీమ్ములను చాలా అభిమానించారు. కానీ మీరు ఇలా చేస్తారు అని కలలో కూడా ఉహించిఉండరు.

పాపం ఆర్టీసీ వాళ్ళు సర్.. వాళ్లకు వచ్చే 15000 జీతం తీసుకొని ఫ్యామిలీని చూసుకుంటూ చాలా గౌరవంగా బ్రతుకుతున్నారు. మీరూ వాళ్లకు ఏమి ఇవ్వకున్న కనీసం పిలిచి మాట్లాడి ఉంంటే మీ మీద గౌరవం తో ప్రాణాలు ఇచ్చేవారు. నేను ఎలాగో మీ బంగారు తెలంగాణ లో సంతోషంగా లేను. కనీసం మా తల్లిదండ్రులను సంతోషంగా ఉండేటట్లు నెల నెలా వాళ్ళకి వృద్దాప్య పింఛన్ ఇవ్వండి. ఎందుకంటే మిమ్ములను నమ్మి మీకు మా కేసీఆర్ అని ఓటు వేశారు. ప్రతి రోజు ఈ అరెస్టులు ఏంది? ఈ లాఠీ దెబ్బలు ఏంది? నా ఆర్టీసీ సోదరులు ఏమి తప్పు చేశారు? ఇంకా ఎంత మందిని ఆత్మహత్యలు చేస్కునేట్టు చేస్తారు?

అందుకే ఇటు ఇవన్నీ భరించలేకనే అటు నా ఆత్మభిమానాన్ని చంపుకొని ఉద్యోగం చేయ‌లేక రాజీనామా చేస్తున్నాను. మీ మాయ మాటలు నమ్మి మోసపోయిన వ్య‌క్తిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిగా ఉన్నాను కాబట్టి నా తల్లిదండ్రులకు అయినా వృద్ధాప్య పింఛను ఇవ్వండి. నా పేరు మీద సెంటు భూమి లేదు కాబట్టి మూడు ఎకరాల పొలం, నా పిల్లలకి ప్రభుత్వ స్కూల్లో చదువు, నాకు ఉండడానికి ఇల్లు లేదు కనుక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వండి. ఒకవేళ మీరు ఇవేమి ఇవ్వకున్నా.. క‌నీసం సమాజంలో గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించాలని కోరుతూ అలాగే నా ఉద్యోగ రాజీనామా ను తక్షణమే ఆమోదించ‌గ‌ల‌రు అంటూ లేఖ రాశాడ‌త‌డు.

Read more RELATED
Recommended to you

Latest news