ఎస్‌ఐ ఉద్యోగాల ప్రాథమిక పరీక్ష కీ విడుదల

-

 రాష్ట్రంలో ఎస్‌ఐ ఉద్యోగాల కోసం ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రాథమిక ‘కీ’ని పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’ని www.tslprb.in లో చూడొచ్చని తెలిపింది. ‘కీ’పై అభ్యంతరాలను ఈనెల 15 వరకు స్వీకరిస్తామని పేర్కొంది.

ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నపత్రంలో ఏకంగా 8 తప్పులు దొర్లాయి. మరో 6 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు సరైనవేనని గుర్తించారు. ఇంగ్లీష్‌-తెలుగు వెర్షన్‌లోని ‘ఎ’ బుక్‌లెట్‌లో 43, 111, 146, 173, 180, 184, 195, 199 ప్రశ్నల్లో తప్పులు దొర్లాయి. ఈ నేపథ్యంలో ప్రతి అభ్యర్థికి 8 మార్కులు కలపాలని మండలి ఉన్నతాధికారులు నిర్ణయించారు. మొత్తం 200 ప్రశ్నలకు 60 మార్కులను (30%) అర్హతగా నిర్ణయించిన సంగతి విదితమే.

తాజా నిర్ణయం నేపథ్యంలో 52 మార్కులొచ్చిన అభ్యర్థి సైతం పరీక్షలో గట్టెక్కినట్లే. ఆయా అభ్యర్థులు తదుపరి శారీరక సామర్థ్య పరీక్షలకు అర్హత సాధించినట్లవుతుంది. మరో ఆరు ప్రశ్నలకు ఒకటికంటే ఎక్కువ సమాధానాలు సరైనవేనని గుర్తించారు. ‘ఎ’ బుక్‌లెట్‌లో 54వ ప్రశ్నకు 3 సరైన సమాధానాలుండగా.. 114, 183, 186, 192, 197 ప్రశ్నలకు రెండేసి సరైన సమాధానాలున్నాయి. వీటిలో దేనికి బబ్లింగ్‌ చేసినా మార్కులిచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఒకటికంటే ఎక్కువ సమాధానాలున్న ప్రశ్నలకు సైతం మార్కులు కలపాలనే వాదన వినిపిస్తోంది. ‘తప్పు సమాధానాలకు నెగెటివ్‌ మార్కులున్నందున పలువురు అభ్యర్థులు వాటిని వదిలేసే అవకాశముంది. దీంతో బహుళ సమాధానాలున్న ప్రశ్నలకూ మార్కులు కలపాలి’ అని అక్షర సర్కిల్‌ నిర్వాహకుడు విష్ణువర్ధన్‌ డిమాండ్‌ చేశారు.

పరీక్ష ‘కీ’ని www.tslprb.in వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. కీపై అభ్యంతరాలుంటే వాటిని.. వెబ్‌సైట్లో పొందుపరచిన ప్రత్యేక నమూనాపత్రం ద్వారా ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ తెలపవచ్చని వెల్లడించారు. ప్రతి ప్రశ్నను వేరువేరుగా సమర్పించాలని, సంబంధిత ధ్రువపత్రాలను జతచేయాలని ఛైర్మన్‌ స్పష్టం చేశారు. అసంపూర్తిగా ఉన్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని, వ్యక్తిగతంగా ఇచ్చే అభ్యర్థనలను స్వీకరించబోమని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news