బాలు హాస్పిటల్ బిల్లుపై ఇంత దుష్ప్ర‌చారమా… ?

-

ఇటీవలే మరణించిన ఎస్సీ బాలసుబ్రమణ్యం విషయంలో వివాదం రేగటం చాలా దురదృష్టం. బాలు చనిపోయి నాలుగు రోజులు కూడా కాకపోయినా వెంటనే హాస్పిటల్ బిల్లు చెల్లింపు విషయంలో రేగిన వివాదం కుటుంబసభ్యులనే కాకుండా యావత్ అభిమానులను నిజంగానే బాధపెడుతోంది.   కోరనావైరస్ తో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన బాలు చివరకు 52 రోజుల తర్వాత చనిపోయిన విషయం తెలిసిందే. బాలు మృతిచెందిన రెండోరోజు నుండే ఓ విషయం సోషల్ మీడియాలో చాలా గట్టిగా చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలోని విషయం కూడా వాస్తవానికి దగ్గరగానే ఉన్నదన్న కారణంగా నెటిజన్లు బాగా సర్కులేట్ చేశారు.

అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఈ విషయం ఇటు కుటుంబసభ్యులతో పాటు అటు ఆసుపత్రి యాజమాన్యం దృష్టికి చేరటంతో చివరకు స్పందిచక తప్పలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే 52 రోజుల ఆసుపత్రి బిల్లు రూ. 3 కోట్లయ్యిందట. ఆ మొత్తాన్ని బాలు కుటుంబసభ్యులు చెల్లించలేకపోయారట. బిల్లులో కొంతమొత్తాన్ని చెల్లించినా పూర్తిగా చెల్లించని కారణంగా ఆసుపత్రి యాజమాన్యం బాలు భౌతికకాయాన్ని ఇవ్వలేదట. అయితే విషయం తెలిసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబంతో పాటు మరికొందరు ప్రముఖులు జోక్యం చేసుకోవటంతో బిల్లు సెటిలైందని, అపుడు భౌతికకాయాన్ని ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇదే విషయమై బాలు కొడుకు ఎస్పీ చరణ్ వీడియో సందేశంలో మాట్లాడుతూ తన తండ్రి ఆసుపత్రి బిల్లు విషయంలో రేగిన వదంతి చాలా దురదృష్టమన్నారు. తన తండ్రకయిన ఆసుపత్రి బిల్లును ఎప్పటికప్పుడు తాము క్లియర్ చేసేసినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్నట్లుగా తాము ఆసుపత్రికి బిల్లు పెండింగ్ లో లేదని, తమ తరపున ఎవరు బిల్లు చెల్లించలేదని కూడా స్పష్టం చేశారు. మొత్తం బిల్లును తామే సొంతంగా డబ్బులు చెల్లించి కొంత, ఇన్య్సూరెన్సు ద్వారా మరికొంత సెటిల్ చేసుకున్నట్లు క్లారిటి ఇచ్చారు.

చివరగా చెల్లించాల్సిన బిల్లు విషయంలో ఆసుపత్రి ఛైర్మన్  మాట్లాడుతూ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పినట్లు వివరించారు. ముందు జరగాల్సిన పనులు చూడండని బిల్లు విషయం మరచిపోండని ఛైర్మన్ చెప్పిన విషయాన్ని చరణ్ చెప్పారు. మరి ఇపుడైనా ఆసుపత్రి బిల్లు విషయంలో రేగిన వివాదం సద్దుమణుగుతుందా ?  లేదా ? అన్న‌ది చూడాలి.

-Vuyyuru Subhash 

Read more RELATED
Recommended to you

Latest news