ఇంగ్లండ్ గ‌డ్డ‌పై టీమిండియా ప్రాక్టీస్ షురూ..!

-

ఇంగ్లండ్ చేరుకున్న భార‌త క్రికెట్ జ‌ట్టు స‌భ్యులు ఇప్ప‌టికే ప్రాక్టీస్ కూడా మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలోనే ఇండియా జూన్ 5వ తేదీన సౌతాఫ్రికాతో త‌న తొలి మ్యాచ్‌ను ఆడ‌నుంది.


ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 కోసం టీమిండియా ఇప్ప‌టికే ఇంగ్లండ్ బ‌య‌ల్దేరి వెళ్లిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే భార‌త ఆట‌గాళ్లు ఇంగ్లండ్‌కు చేరుకున్నారు. ఐపీఎల్ కార‌ణంగా బాగా అల‌సిపోయిన భార‌త ఆట‌గాళ్లు ఆ టోర్న‌మెంట్ అనంత‌రం రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకున్నారు. అదే స‌మ‌యంలో వ‌ర‌ల్డ్ కప్ కోసం నెట్స్‌లో ప్రాక్టీస్ కూడా చేశారు. ఆ త‌రువాత ఇంగ్లండ్‌కు ప్ర‌యాణ‌మై వెళ్లారు.

కాగా ఇంగ్లండ్ వెళ్ల‌క ముందు ముంబై ఎయిర్‌పోర్టులో భార‌త ఆట‌గాళ్లు విమానం కోసం ఎదురు చూస్తున్న ఫొటోల‌ను బీసీసీఐ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేయ‌గా, ఇప్పుడు ఇంగ్లండ్ వెళ్లాక అక్క‌డి భార‌త ఆట‌గాళ్ల ఫొటోల‌ను కూడా బీసీసీఐ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. హ‌లో ఇంగ్లండ్‌.. క్రికెట్ వ‌ర‌ల్డ్ కోసం మేం వ‌చ్చాం.. అంటూ టీమిండియా హ్యాష్‌ట్యాగ్‌ను బీసీసీఐ త‌న ట్వీట్‌లో కోట్ చేసింది.

ఇక ఇంగ్లండ్ చేరుకున్న భార‌త క్రికెట్ జ‌ట్టు స‌భ్యులు ఇప్ప‌టికే ప్రాక్టీస్ కూడా మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలోనే ఇండియా జూన్ 5వ తేదీన సౌతాఫ్రికాతో త‌న తొలి మ్యాచ్‌ను ఆడ‌నుంది. ఆ త‌రువాత జూన్ 9న ఆస్ట్రేలియాతో, 13న న్యూజిలాండ్‌తో, 16న పాకిస్థాన్‌తో, 22న ఆప్ఘ‌నిస్థాన్‌తో, 27న వెస్టిండీస్‌తో, జూన్ 30న ఇంగ్లండ్‌తో, జూలై 2న బంగ్లాదేశ్‌తో, 6న శ్రీ‌లంక‌తో ఇండియా మ్యాచ్‌లు ఆడ‌నుంది. కాగా పుల్వామా ఘ‌ట‌న జ‌రిగిన త‌రువాత భార‌త్ పాక్‌తో త‌ల‌ప‌డుతున్న మ్యాచ్ కావ‌డంతో జూన్ 16న జ‌ర‌గ‌నున్న మ్యాచ్ ప‌ట్ల అభిమానుల్లో విప‌ర‌తీమైన ఆస‌క్తి ఏర్ప‌డింది..!

Read more RELATED
Recommended to you

Latest news