బంగారు ఉంగరం పోయిందని డిగ్రీ విద్యార్థిని సూసైడ్

-

బంగారు ఉంగరం పోయిందని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో చోటుచేసుకుంది. ‘సారీ డాడీ…నాకు భయమేస్తోంది’ అంటూ లేఖ రాసిపెట్టి ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. యువతి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

గున్నేపల్లి గ్రామానికి చెందిన మద్దుల జానకి రాములు-రాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె హేమలతారెడ్డి(19) హనుమకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. చిన్న కుమార్తె అశ్విత మరిపెడలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఉగాది పండుగ సెలవులకని హేమలతారెడ్డి ఈ నెల 20న ఇంటికొచ్చింది.

బుధవారం తన చేతికున్న పావుతులం బంగారపు ఉంగరం ఎక్కడో జారిపోయింది. అన్నిచోట్ల వెతికినా దొరకలేదు. ఆర్నెల్ల కిందట బంగారు గొలుసు పోగొట్టుకుంది. ఇప్పుడు ఉంగరం కూడా పోవడంతో తల్లిదండ్రులు ఏమంటారోనన్న భయంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం పొలం నుంచి ఇంటికి తిరిగొచ్చిన తల్లిదండ్రులు లోపలికి వెళ్లి చూడగా తమ కుమార్తె ఉరివేసుకుని కనిపించడంతో వారు గుండెలవిసేలా రోదించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని యువతి మృతిపై ఆరా తీయగా ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ లభించింది. అందులో ‘సారీ డాడీ…నాకు భయమేస్తోంది’ అని రాసి ఉందని ఎస్సై జగదీశ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news