తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులను కరోనా వదలడంలేదు. తాజాగా హైకోర్టులో కరోనా కలకలం రేపింది. హైకోర్టు సిబ్బందికి, సెక్యూరిటీ బలగాలకు కరోనా పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్ అని తేలింది. ఈ కేసులతో కలిపి మొత్తం ఇప్పటి వరకు 25 మందికి కరోనా సోకింది. దీంతో రేపటి నుండి హైకోర్టును మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టును పూర్తిగా శానిటైజేషన్ చేయాలంటూ న్యాయమూర్తులు ఆదేశించారు. అందుకు సంబంధించి హైకోర్టులోని ఫైల్స్ అన్నింటినీ జ్యూడీషియల్ అకాడమీకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

కేవలం ప్రధాన కేసులను మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేసే కేసుల విషయంలో ఏలాంటి మార్పులు ఉండబోవని హైకోర్టు పేర్కొంది.