తెలంగాణ ఇంటర్ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే

-

అయిదేళ్ల తర్వాత ఇంటర్‌బోర్డు పాలకమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు ఛైర్మన్‌, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి.. వైస్‌ ఛైర్మన్‌, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్‌, ఇతర సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో 2017 నుంచి అమలు చేసిన వాటికి బోర్డు ఆమోదం తెలపడంతో పాటు పలు కొత్త నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో సిబ్బంది, విద్యార్థులకు బయోమెట్రిక్‌ హాజరును ఈ విద్యా సంవత్సరమే అమలు చేయాలని నిర్ణయించింది.

మరిన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఇవీ..

* ఎంపీసీ గ్రూపు రెండో ఏడాది గణితం- 2బిలో ఎక్కువ మంది విద్యార్థులు తప్పుతున్నారు. సిలబస్‌ అధికంగా, కఠినంగా ఉందనే భావన ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది కొంత మేర సిలబస్‌ తగ్గిస్తారు. అందుకు ఓ కమిటీని నియమిస్తారు.

* ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు అనుగుణంగా నీట్‌, కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు(క్లాట్‌) తదితర పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా సిలబస్‌ రూపొందిస్తారు.

* వచ్చే విద్యా సంవత్సరం(2023-24) ప్రథమ, 2024-25లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ద్వితీమ భాష సబ్జెక్టుల సిలబస్‌ మారుస్తారు. నైతికతను పెంచే పాఠాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు.

* ఇంటర్‌బోర్డులో 52 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేస్తారు. ఒక్కో చోట మూడు ఉద్యోగాల చొప్పున 15 జిల్లాల్లోని నోడల్‌ అధికారుల కార్యాలయాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులను భర్తీ చేస్తారు.

* కామర్స్‌ను కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీగా పిలుస్తారు.

* అంధులు, మూగ, చెవిటి విద్యార్థులకు ఇప్పటివరకు పరీక్షల్లో సాధారణ విద్యార్థుల కంటే 30 నిమిషాల సమయం అధికంగా ఇచ్చేవారు. దాన్ని 60 నిమిషాలకు పెంచుతారు. ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేస్తారు.

ఇంటర్‌ పాఠ్య పుస్తకాలను సకాలంలో అందించేందుకు వెంటనే టెండర్లు పిలవాలని నిర్ణయించామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా గృహ, వాణిజ్య సముదాయాల్లోని( మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీ) ప్రైవేట్‌ కళాశాలలకు ఒకటీ రెండేళ్ల పాటు అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ నుంచి మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నామని, దీనిపై హోంమంత్రితో మాట్లాడామని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏటా మే నెలాఖరు నాటికి అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. పరీక్ష ఫీజును పెంచడం లేదని స్పష్టంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news