తెలంగాణ సంపద కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయింది – వైఎస్ షర్మిల

-

తెలంగాణ సంపద కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందని విమర్శలు చేశారు వైఎస్ షర్మిల. నీళ్లు, నిధులు, నియామకాల కోసం మూడు కోట్ల మంది ఏకమై, కొట్లాడితే వచ్చింది “తెలంగాణ”. అమరవీరుల త్యాగ ఫలితం, సబ్బండ వర్గాల పోరాట ఫలితం “తెలంగాణ”. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ ఉద్యమ ఆకాంక్షలు, ఆశయాలు కనుమరుగవుతున్న వేళ.. దొరల పాలన మళ్లీ వచ్చిన యాళ్ల, ప్రతిపక్షాలు అమ్ముడుపోయిన సమయంలో పుట్టిందే YSR తెలంగాణ పార్టీ. నియామకాల కోసం మొట్టమొదటగా పోరాటం చేసి.. గెలిచి, నిలిచింది YSRTP అని వెల్లడించారు.

అన్నం మెతుకులు ముట్టకుండా నిరుద్యోగ దీక్షలతో సర్కారు మెడలు వంచి నోటిఫికేషన్లు ఇప్పించింది. కాంట్రాక్టు కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాల నిలబడింది. నిధులు పక్కదారి పడుతుంటే, తెలంగాణ సంపద కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయితే ప్రశ్నించే గొంతుకగా నిలిచింది. రాష్ట్రాన్ని 5లక్షల కోట్ల అప్పులకుప్ప చేస్తే ఎదురు నిలిచి, ప్రశ్నించింది. అక్రమ అరెస్టులతో, పోలీసు లాఠీలతో, అక్రమ నిర్బంధాలతో హింసించినా.. మొక్కవోని దీక్షతో పోరాటం చేసింది. నీటి వాటాల్లో అన్యాయం జరిగితే, కాళేశ్వరంతో వేల కోట్లు దోచుకుంటే.. నిస్వార్థంగా ఉద్యమించిందని పేర్కొన్నారు.

3800 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి, కేసీఆర్ ఇచ్చిన మోసపూరిత వాగ్ధానాలను ఎండగట్టింది. రుణమాఫీ, డబుల్ బెడ్ రూం ఇండ్లు, పోడు పట్టాలు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, మూడెకరాల భూమి, వడ్డీ లేని రుణాలు, కేజీ టు పీజీ ఉచిత విద్యపై గొంతెత్తింది. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలంటే మళ్లీ మరో ఉద్యమం జరగాలి. సర్కారు మారితేనే బతుకులు మారుతాయి. మళ్లీ వ్యవసాయం పండుగ కావాలన్నా, సొంతింటి కల నెరవేరాలన్నా.. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు కావాలన్నా YSR సంక్షేమ పాలన రావాలి. జలయజ్ఞం ద్వారా జలసిరులు కురవాలి. అర్హులకు పోడు పట్టాలు అందాలి. పేదలకు భూములు దక్కాలి. దళిత, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగాలి. ప్రజలు అభివృద్ధి బాట పట్టాలి. సబ్బండ వర్గాలకు సంక్షేమం చేరాలి. ఇందుకోసం వైయస్ఆర్ బిడ్డ కట్టుబడి ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news