బస్సు టికెట్ తీసుకోమన్నందుకు కండక్టర్ ను హత్య చేసిన ప్రయాణికుడు.

-

బస్సు టికెట్టు తీసుకోవాలని కండక్టరు అడిగినందుకు ఓ తాగుబోతు చేసిన పనికి కండక్టరు చనిపోయాడు.తాగిన మత్తులోనే ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. కోయంబేడు బస్టాండ్ నుంచి వీల్లుపురానికి బస్సు శనివారం వేకువజామున బయలుదేరింది. ఉదయం 4గంటల సమయంలో మధురాంతకం బస్టాండ్ లో కొందరు ప్రయాణికులు ఎక్కారు. వీరిలో పీకలదాకా తాగిన 40 సంవత్సరాల వ్యక్తి కూడా ఉన్నాడు. బస్సు కండక్టర్ పెరుమాల్ (55) ఆ వ్యక్తిని టికెట్ తీసుకోమని అడిగాడు.

దీంతో ఆగ్రహించిన అతడు కండక్టర్ తో గొడవకు దిగాడు. ఎంతకీ టికెట్ తీసుకోకపోవడంతో కండక్టర్ బస్సు ఆపి ఆ వ్యక్తిని కిందికి దించేందుకు ప్రయత్నించగా.. మద్యం మత్తులో అతడు ఆగ్రహంతో కండక్టర్ పై దాడికి దిగాడు. ఈ ఘర్షణలో కండక్టర్ కింద పడటంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే బస్ డ్రైవర్ తో పాటు స్థానికులు కండక్టర్ ని చికిత్స నిమిత్తం మేల్ మరువత్తూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే కండక్టర్ చనిపోయాడు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు మురుగన్ (తాగుబోతుని) అరెస్ట్ చేశారు. కాగా ఈ సంఘటనపై ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. కండక్టర్ కుటుంబీకులకు తన ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఓ ప్రకటన జారీ చేశారు. బాధిత కుటుంబీకులను ఓదార్చి ప్రభుత్వం తరఫున పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news