ఆ నలుగురు మంత్రులు ‘ఐదేళ్లు’ ఫిక్స్…

-

జగన్ అధికారంలోకి రాగానే ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని, అవకాశం దక్కనివారికి మళ్ళీ రెండున్నర ఏళ్లలో మంత్రివర్గ విస్తరణ చేసే సమయంలో ఛాన్స్ ఇస్తానని చెప్పారు. అలాగే పనితీరు బాగోని మంత్రులని పక్కన పెట్టేస్తా అని అప్పుడే చెప్పేశారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చి రెండు ఏళ్ళు దాటేసింది. అంటే మరో రెండు, మూడు నెలల్లో జగన్ క్యాబినెట్‌లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి.

jagan
jagan

అయితే ఈ మంత్రివర్గ విస్తరణపై అనేక రకాల ప్రచారాలు వస్తున్నాయి. మొదట క్యాబినెట్‌లో 50 శాతం మంత్రులని పక్కనబెడతారని ప్రచారం రాగా, ఆ తర్వాత మొత్తం మంత్రులని తొలగించి, కొత్తవారికి అవకాశం ఇస్తారని ప్రచారం వచ్చింది. ఇలా మంత్రివర్గ విస్తరణపై అనేక రకాలుగా చర్చలు నడుస్తున్నాయి. కానీ అందుతున్న సమాచారం ప్రకారం కొందరు మంత్రులనే జగన్ పక్కకు తప్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇదే సమయంలో నలుగురు మంత్రులని జగన్ ఖచ్చితంగా కొనసాగిస్తారని ప్రచారం జరుగుతుంది. మొదట సీనియర్ మంత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డిలు జగన్ క్యాబినెట్‌లో కంటిన్యూ అవుతారని తెలుస్తోంది. ఈ ముగ్గురు సీనియర్లు వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, పుర‌పాల‌క మంత్రిగా బొత్స స‌త్య‌నారాయ‌ణ, విద్యుత్, అటవీ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిల పదవీకాలం ఐదేళ్ల పాటు కొనసాగనుందని తెలుస్తోంది.

అటు ఆర్ధిక మంత్రిగా ఏపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఐదేళ్ల పాటు ఖచ్చితంగా కొనసాగుతారని తెలుస్తోంది. ఆర్ధిక మంత్రిగా బుగ్గన కాకుండా మరో నాయకుడు న్యాయం చేయడం కష్టమే అని చెప్పొచ్చు. పైగా ఇప్పుడు రాష్ట్రానికి అప్పులు తీసుకురావడంలో బుగ్గనదే కీలక పాత్ర. ఇలాంటి సమయంలో బుగ్గనని తప్పించి మరొకరికి ఆర్ధిక శాఖ బాధ్యతలు అప్పగించడం కష్టమే. ఏదేమైనా ఈ నలుగురు, ఐదేళ్ల పాటు మంత్రులుగా కొనసాగడం ఖాయమనే తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news