శ్రీవారి ఆనంద నిలయం ప్రాజెక్టు అటకెక్కింది అందుకేనా

-

టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్ట్ కు మంగళం పాడేసింది. ఇచ్చిన విరాళాన్ని దాతలు వెనక్కు తీసుకునే అవకాశం కల్పించింది. లేదంటే వాటిని ఇతర ప్రాజెక్టులకు మళ్లించుకుంటామంటోంది టీటీడీ. 2009 జూన్ నుంచి అవాంతరాలు ప్రారంభమయిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తిగా అటకెక్కడానికి కారణం ఎవరు…

శ్రీవారికి రాజుల కాలం నుంచి ఇప్పటి వరకు అలంకరణకు వినియోగించే ఆభరణాలే 1296కంటే పైనే ఉన్నాయి. ఇంతటి వైభవం కలిగిన స్వామివారు స్వయంభూవై వెలసిన ఆనంద నిలయం గోపురాన్ని 15వ శతాబ్దంలోనే స్వర్ణమయం చేశారు. అనంతమయిన సిరిసంపదలున్న శ్రీవారి ఆలయాన్ని అనంత స్వర్ణమయం చేయాలనుకున్నారు అప్పటి పాలకమండలి చైర్మన్ ఆదికేశవులునాయుడు. 2008 ఆగస్టులో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టగానే ఈ ప్రాజెక్ట్ ను తెర పైకి తీసుకొచ్చారు. 100 కోట్ల రూపాయల అంచనాతో 450 కేజీల బంగారాన్ని వినియోగించి శ్రీవారి ఆనంద నిలయాన్ని అనంత స్వర్ణమయం చేయాలని 2008 సెప్టెంబర్ లో తీర్మానించింది పాలకమండలి.

2008 అక్టోబర్ 1న ఈ ప్రాజెక్ట్ ని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. అదే రోజే అప్పటి కర్నాటక సీఎం యడ్యూరప్పా ఈ ప్రాజెక్ట్ కు బంగారాన్ని విరాళంగా అందిచారు. తర్వాత భక్తులు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. విరాళాల స్వీకరణ ప్రారంభించిన నెలలోనే 83 మంది నుంచి 94.8 కేజీల బంగారం వచ్చింది. 187 మంది దాతలు 12.86 కోట్ల రూపాయల నిధులను స్వామికి సమర్పించారు. రెండు దశలలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చెయ్యాలని నిర్ణయించారు. మొదటి దశలో శ్రీవారి ఆలయంలోని ఘంటా మండపం నుంచి హుండీ వరకు రెండో దశలో వైకుంఠ ప్రదక్షణ మార్గంలో బంగారు తాపడం చెయ్యించాలని నిర్ణయించారు.

ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్ట్ కు అనతి కాలంలోనే 270 మంది దాతలు స్పందించి భారీగా విరాళాలు అందించారు. ఈ ప్రాజెక్ట్ కు 2009 జూన్ నుంచి అవాంతరాలు ప్రారంభమయ్యాయి. IYR కృష్ణారావు ఈవోగా బాధ్యతలు స్వీకరించాక… నెమ్మదిగా ప్రాధాన్యం తగ్గింది. దీనివల్ల టీటీడీపై ఎక్కువ భారం పడుతుందని అడ్డు చెప్పారు ఈవో. ఈ సమస్యను అధికమించేందుకు భక్తుల నుంచే విరాళాలు సేకరించాలని ప్రతిపాదించారు అప్పటి టీటీడీ చైర్మన్ ఆదికేశవులునాయుడు. ఇక పనులు సాగుతుండగానే ఈ ప్రాజెక్ట్ ఆగమ విరుద్దమంటూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి హైకోర్టుకు ఎక్కారు. దీంతో మొదటి ఆవాంతరం ఎదురైంది….

కానీ ఆగమశాస్ర్తం టీటీడీకి సంబంధించిన వ్యవహారం కావడంతో ఇందులో కోర్టు జోక్యం అనవసం అంటూ హైకోర్టు తేల్చేసింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలనే సంకల్పంతో ఆదికేశవులు నాయుడు ముందుకు వెళ్లాలని ప్రయత్నించినా.. క్రిష్ణారావు చివరిగా ఒక అస్త్రాన్ని వదిలారు. ప్రాజెక్ట్ కారణంగా శ్రీవారి ఆలయ పటిష్టత దెబ్బతింటుదనే ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఆలయ గోడలకు 10 వేలకు పైగా మేకులు కొట్టాల్సి వస్తుందని, ఆలయ గోడల పై ఉన్న శాసనాలు కూడా కనుమరుగై పోతాయని ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ప్రాజెక్ట్ కు మళ్లీ బ్రేకులు పడ్డాయి…

ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్ట్ తో ఆలయ గోడల పటిష్టత దెబ్బతింటుందని తెలుపుతూ ప్రభుత్వానికి రాసిన లేఖ జత చేస్తూ ఈఓ క్రిష్ణారావు కోర్టు మెట్లు ఎక్కడంతో…..ప్రాజెక్ట్ నిలిపివేయాంటూ నుంచి మద్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైకోర్టు ఆదేశాల తర్వాత 2011 జనవరిలో సమావేశమైన టీటీడీ స్పెసిఫైడ్ అథారిటి…ప్రాజెక్ట్ కి భక్తులు ఇచ్చిన విరాళాలను వెనక్కి తీసుకోవడం…లేదా ఇతర ప్రాజెక్టులకు మళ్లించుకోవచ్చనంటూ ఆఫర్ ఇచ్చింది. దీంతో ముగ్గురు దాతలు 3 కేజీల బంగారాన్ని వెనక్కి తీసుకున్నారు. మరో 26 మంది 27 కేజీల బంగారాన్ని ఇతర ప్రాజెక్టులకు కానుకగా సమర్పించుకున్నారు.

ఎప్పటికైనా ఆనంద నిలయం పనులు జరగకపోవా.. తాము ఇచ్చిన కానుకలు అందుకు వినియోగించక పోతారా అనే ఆశతో దాతలున్నారు. అయితే 60.28 కేజీల బంగారాన్ని…. 4.61 కోట్ల రూపాయలను…..అటు వెనక్కి తీసుకోలేదు.. ఇతర ప్రాజెక్టులకు మళ్లించలేదు. దీంతో తాజాగా జరిగిన పాలకమండలి సమావేశంలో ఇదే అంశం పై చర్చించిన పాలకమండలి…..ఇక ప్రాజెక్టును కొనసాగించే ఆలోచన లేకపోవడంతో…..చివరిగా భక్తులుకు విరాళాలు వెనక్కి ఇచ్చేయ్యడం లేదా వారు కోరితే ఇతర ప్రాజెక్టులకు మళ్లించడం….ఒకవేళ దాతలు స్పందించకుంటే వాటిని టీటీడీ ట్రెజరీకి తరలించాలని అలా చేస్తే ఇక భక్తులకు వాటి పై ఎలాంటి హక్కులు ఉండవని తీర్మానించింది. టీటీడీలోని కొంత మంది వల్ల ఆగిపోయిన అనంత స్వర్ణమయం ప్రాజెక్ట్…..చివరికి దాతల మనోభావాలును దెబ్బతీసేలా తయారైంది.

Read more RELATED
Recommended to you

Latest news