ఏపీ అసెంబ్లీలో రోజా సీన్ మళ్లీ రిపీట్ కానుందా

-

టీడీపీ హయాంలో ఏపీ అసెంబ్లీ సమావేశాల విషయంలో రోజా ఎదుర్కొన్న ఇబ్బందుల్లాంటి సీన్లు మళ్లీ రిపీట్ కానున్నాయా..టీడీపీ ఎమ్మెల్యేలది అదే పరిస్థితి ఎదురుకాబోతుందా అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తొలిసారి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ తర్వాత ఈ డౌట్లు మరింతగా పెరిగాయి.

అసెంబ్లీ కేంద్రంగా ఇప్పుడు ఏపీలో ఆసక్తికర రాజకీయం నడుస్తోంది. ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రివిలేజ్ కమిటీలో విచారణ ఎదుర్కొవాల్సిన పరిస్థితులు వచ్చాయి. స్పీకర్ తమ్మినేని సీతారాంను అవమానించేలా ప్రవర్తించారంటూ అచ్చెన్నాయుడు.. సభను తప్పుదోవ పట్టించారని నిమ్మల రామానాయుడు విచారణను ఎదుర్కోనున్నారు. భేటీలో ఫిర్యాదులు పరిశీలించిన కమిటీ వీరిద్దరికీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది.

అయితే..గతంలో ఇదే తరహాలో ప్రివిలేజ్ కమిటీ నోటీసులందుకున్న రోజా సభ నుంచి ఏడాది సస్పెండ్ అయ్యారు. ఈ విషయంలో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎంతో పోరాడింది. కోర్టును కూడా ఆశ్రయించింది. అప్పట్లో ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న గొల్లపల్లి సూర్యారావు నేతృత్వంలో కమిటీ రోజాను క్షమాపణలు అడగాలని సూచించడం.. దానికి ఆమె తిరస్కరించడంతో రాజకీయం రంజుగా సాగింది. అలాగే ఇప్పుడు కూడా అదే తరహా వాతావరణం ఏపీ రాజకీయాల్లో మొదలు కానున్నాయా అన్న చర్చ సాగుతోంది.

అయితే తాము సభను కించపరిచే విధంగా వ్యవహరించలేదని.. అధికార పక్ష సభ్యులే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకుని ఏదో రకమైన కామెంట్లు చేస్తున్నారనేది టీడీపీ చెప్పే విషయం. ప్రతిపక్షం వాదన ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ వేదికగా రాజకీయం రాజుకునే సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news