తిరుప‌తిపై నిరాశ‌లో వైసీపీ… కార‌ణ‌మెవ‌రు?

-

తిరుపతి లోక్‌స‌భ‌కు జరిగే ఉప ఎన్నికల్లో మెజార్టీ ఎంతొస్తుందనేది చూసుకోవాలంటూ ముఖ్యమంత్రి జ‌గ‌న్‌రెడ్డి తిరుపతి పార్టీ నేతలకు సూచించారు. తమ విజయం నల్లేమీద నడకే అనేరీతిలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. విజయం సాధించడమే తరువాయి.. ఎన్నికల్లో మనకు వచ్చే మెజార్టీపై దేశం మొత్తం ఇటువైపు దృష్టిసారించాలంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. విజయంపై అంతటి ధీమాతో ఉన్న ముఖ్యమంత్రిని ఒక విషయం మాత్రం కలవరపెడుతోంది. ఆ కలవరపాటుకు కారణం ఒకే ఒక్కడు.

ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు

తిరుపతి లోక్‌స‌భ నియోజకవర్గ పరిదిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నెల్లూరు జిల్లా పరిధిలోని వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాలుండగా, చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఒకే ఒక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేతోనే జగన్‌కు ఇప్పుడు సమస్య ప్రారంభమైంది. ఆయనే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మారిన పరిణామాల నేపథ్యంలో వెంకటగిరి నుంచి వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆనం రామనారాయణరెడ్డి.

రెండేళ్ల నుంచి ఎడ‌ముఖం పెడ‌ముఖం

ఆనం రామనారాయణరెడ్డికి పార్టీలో చేరితో మంత్రి పదవి ఇస్తానని సీఎం జగన్ ఎన్నికలకు ముందు చెప్పినట్లు ప్రచారం న‌డిచింది. రాజ‌కీయాల్లో సీనియ‌ర్ కాబ‌ట్టి ఆనం కూడా మంత్రి పదవిపై ఆశపెట్టుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలవుతున్నప్పటికీ ఇంతవరకు తనకు సరైన ప్రాతినిధ్యం లభించలేదనే అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా రెండుమూడుసార్లు నిరసన గళం కూడా వినిపించారు. ప్రభుత్వంలో తనకు పనులు కూడా ఏమీకావడంలేదని, సీనియర్‌ను అయినప్పటికీ పార్టీలో సరైన గౌరవం దక్కడంలేదని ఆనం చాలా అసంతృప్తితో ఉన్నట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.

గెలుపోట‌ములు తారుమార‌వుతాయా?

తిరుపతి లోక్‌స‌భ నియోజకవర్గ పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజార్టీ వచ్చి వెంకటగిరిలో తగ్గితే ఆ ప్రభావం పార్టీపై, పడుతుందని, ఒక్కోసారి మెజార్టీని ప్రభావితం చేసి ఎన్నికల్లో గెలుపోటములను కూడా తారుమారు చేస్తుందనే ఒత్తిడితో జగన్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దేశం మొత్తం తిరుప‌తివైపు దృష్టిసారించేలా మెజార్టీ రావాల‌నేది సీఎం ల‌క్ష్యం. అందులోను త‌న స‌న్నిహితుడు పోటీచేస్తున్నాడు. కాబ‌ట్టి గెల‌వ‌డం ఎంత ముఖ్య‌మో భారీ మెజార్టీ రావ‌డ‌మ‌నేది కూడా అంతే ముఖ్య‌మైంది. ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌దిలిపెట్ట‌కూడ‌ద‌ని, ఏ చిన్న అల‌స‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించ‌కూడ‌ద‌ని పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు సీఎం స్ప‌ష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆనంతో మాట్లాడి వెంకటగిరి నుంచి పార్టీకి మెజార్టీ వచ్చేలా చూస్తార‌ని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. పార్టీలో అస‌మ్మ‌తి నేత‌గా ఉన్న ఆనంతో జ‌గ‌న్ మాట్లాడ‌తారా? అనేది సందేహాస్ప‌ద‌మే!!.

Read more RELATED
Recommended to you

Latest news