వైట్​హౌజ్​పై తెలుగు కుర్రాడి దాడి.. బైడెన్​ను చంపేందుకేనట

-

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌పై ఓ తెలుగు కుర్రాడు దాడికి దిగబడ్డాడు. ట్రక్కుతో దూసుకువచ్చిన ఓ 19 ఏళ్ల యువకుడిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో భారీ ట్రక్కులో వచ్చిన సాయివర్షిత్‌ కందుల వైట్‌హౌస్‌ ఉత్తర భాగం వైపు భద్రతా నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ బారియర్స్‌ను ఢీకొట్టాడు. అనంతరం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ట్రక్కుకు నాజీ జెండా కట్టి ఉన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి.

యువకుడిని ప్రశ్నించగా తాను అమెరికా అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకున్నానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అతనిపై మారణాయుధాల వినియోగం, వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం, దేశాధ్యక్షుడికి ప్రాణహాని కలిగించేందుకు యత్నించడం, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం తదితర అభియోగాలు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అమెరికాలోని ఛెస్ట్‌ఫీల్డ్‌కు చెందిన సాయివర్షిత్‌ 2022లో మార్క్వెట్‌ సీనియర్‌ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేట్‌ అయినట్లుగా గుర్తించారు. సామాజిక మాధ్యమాల్లోని ఖాతాల ద్వారా అతని వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news