పీవీపీ ఇంటిపై దాడి.. ప‌రారీలో నిర్మాత బండ్ల గ‌ణేష్‌

-

టాలీవుడ్ నిర్మాత, వైసీపీ నేత పీవీపీ ఇంట్లో హల్ చల్ చేసిన కేసులో మరో నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ పరారీలో ఉన్నట్టు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. అగ్ర నిర్మాత‌లుగా ఉన్న వీరిద్ద‌రి మ‌ధ్య గ‌త రెండేళ్లుగా తీవ్ర‌మైన  వివాదం న‌డుస్తోంది. ఈ వివాదానికి జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన టెంప‌ర్ సినిమాయే. 2015లో వ‌చ్చిన ఈ సినిమాకు బండ్ల గ‌ణేష్ నిర్మాత‌.

సినిమా మ‌ధ్య‌లో ఆర్థిక ప‌ర‌మైన ఇబ్బందులు త‌లెత్త‌డంతో టెంపర్ సినిమాకు పీవీపీ రూ. 7 కోట్ల ఫైనాన్స్ చేయగా, ఆ డబ్బులను బండ్ల గణేశ్ తిరిగి ఇవ్వలేదు. గత కొంతకాలంగా డబ్బుకోసం ప్రయత్నించిన పీవీపీ, ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. త‌న‌పైనే పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తావా ? అంటూ బండ్ల పీవీపీపై ఫైర్ అయిన‌ట్టు పీవీపీ చెపుతున్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి పీవీపీ ఇంటిపై దాడి చేసిన బండ్ల గణేశ్, ఆయన అనుచరులు, పీవీపీని, ఆయన కుటుంబీకులను బెదిరించారు.

ఈ క్ర‌మంలోనే పీవీపీ స్వ‌యంగా జూబ్లీహిల్స్ పీఎస్ లో స్వయంగా ఫిర్యాదు చేశారు. బండ్ల గణేశ్ సహా మరో నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు, వెంటనే ఆయన ఇంటికి, కార్యాలయానికి వెళ్లగా, అక్కడాయన అందుబాటులో లేరు. దీంతో బండ్ల గణేశ్ ఎక్కడున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేక టీమ్ లను నియమించినట్టు పోలీస్ ఉన్న‌తాధికారులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news