అలా తీస్తే సినిమా హిట్‌ కాదు: రాజమౌళి

-

ఆర్‌ఆర్‌ఆర్‌’కు హాలీవుడ్‌ ప్రేక్షకులు, సినీ వర్గాల నుంచి ఇంత గొప్ప ఆదరణ లభిస్తుందని తాను అనుకోలేదని అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా ఆయన తెరకెక్కించిన చిత్రమిది. ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుని, ఏకంగా రూ.1000కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దర్శకుడు రాజమౌళి ఇటీవల టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘‘బాహుబలి’కి జపాన్‌లో మంచి మైలేజ్‌ వచ్చింది. నేను ఎంచుకునే కథలు తెలుగు దాటి ఇతర రాష్ట్రాలకు వెళ్తాయని నాకు నమ్మకం ఉండేది. కానీ, దేశం దాటి వెళ్తాయని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ‘బాహుబలి’కి జపాన్‌లో వచ్చిన ఆదరణ చూసిన తర్వాతే నాకు నమ్మకం కలిగింది. తూర్పు దేశాల ప్రజలకు మన సినిమాలు నచ్చుతాయని అర్థమైంది. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను పశ్చిమ దేశాల్లోని ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేయలేదు. కనీసం ఆ ఆలోచన కూడా లేదు. కానీ, సినిమా విడుదలైన తర్వాత నెమ్మదిగా అక్కడి ప్రేక్షకులకు కూడా నచ్చిందన్న అభిప్రాయాలు రావడం మొదలయ్యాయి. ఏదో కొద్దిమందికి నచ్చిందేమో అనుకున్నా. నెమ్మదిగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను మెచ్చుకునే వారి సంఖ్య పదుల నుంచి వందలు, వందల నుంచి వేలకు పెరిగింది. హాలీవుడ్‌ రచయితలు, దర్శకులు, విమర్శకులు వివిధ రంగాలకు చెందిన ప్రజలు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి గొప్పగా మాట్లాడటం చూసి, ఇవన్నీ నా గురించి, నా సినిమాల గురించేనా? అని అనిపించింది’’

‘‘హాలీవుడ్‌ ప్రేక్షకులకు నా సినిమాలు నచ్చుతున్నాయి కదాని, నా ఆలోచన ధోరణి మార్చుకుని, నేను కూడా అలా సినిమాలు తీస్తే, అది సరిగా వర్కవుట్‌ కాకపోవచ్చు. కథను చెప్పే విధానంలో నాకంటూ ప్రత్యేకశైలి ఉంది. దాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి. అంతేకానీ, పూర్తిగా నా శైలిని మార్చుకుని సినిమాలు తీయకూడదు. అలా చేస్తే, రెండు పడవలపై ప్రయాణం చేసినట్లే. నేను కథను చెప్పే విధానానికి కట్టుబడి ఉంటూనే, దాన్ని మరింత చక్కగా, మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా తీర్చిదిద్దాలి. ఇలా ఎన్ని రకాల మార్పులు, అదనపు హంగులు జోడించినా, అంతిమంగా అది కచ్చితంగా నా స్టోరీ అయి ఉండాలి. ‘ఇది రాజమౌళి స్టోరీ కాదే’ అనిపించకూడదు. కథ చెప్పే విషయంలో మీరు నన్ను మార్గ నిర్దేశకుడు అంటున్నారు. నిజం చెప్పాలంటే నేను ఇప్పుడిప్పుడే అడుగులు వేయటం మొదలు పెట్టాను. చూద్దాం.. ఇలాగే ముందుకు వెళ్తే, మరింత విజయవంతమైతే అప్పుడు మీరు అన్నది కరెక్ట్‌ అవుతుందేమో చూడాలి’’ అని రాజమౌళి అన్నారు.

‘ఆర్‌ఆర్ఆర్‌’ తర్వాత మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి ఓ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి రెండు కథలు సిద్ధం చేసినట్లు రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ చెప్పారు. అందులో ఒకటి అడవి నేపథ్యంలో సాగే అడ్వెంచర్‌ మూవీ కాగా, మరొకటి జేమ్స్‌ బాండ్‌ తరహాలో ఉంటుందని టాక్‌. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news