వయసు పెరిగిన ఈ హీరోయిన్ల జోరు తగ్గలే.. కొత్త నాయికలకు పోటీగా 

-

కొందరు కథానాయికలు వెండితెరపై అలా మెరిసి ఇలా కనుమరుగవుతారు. మరికొందరు ఏళ్లు గడిచినా అగ్రస్థానంలో కొనసాగుతుంటారు. ఒక్క భాషకే పరిమితం కాకుండా ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ హవా చూపుతుంటారు. ఫేడ్‌ ఔట్‌ అనే పదానికి మేం దూరమంటూ… వరుస సినిమాలతో దూసుకెళ్తుంటారు. వారెవరో చూద్దాం…

ఈ విషయంలో అందరి కంటే ముందుంటుంది నయనతార. మనస్సినక్కరే అనే మలయాళ చిత్రంతో 2003లో నటిగా మారిన నయన్‌ 2006లో వెంకటేష్‌ హీరోగా తెరకెక్కిన లక్ష్మితో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఇన్నేళ్లయినా అత్యధిక పారితోషకం అందుకుంటూ.. ఇటు తెలుగు అటు తమిళ చిత్రాలతో బిజీగా ఉంటోంది. ముఖ్యంగా గ్లామర్‌ పాత్రలకే పరిమితం కాకుండా నాయికా ప్రాధాన్య చిత్రాల్లోనూ నటించి తనదైన ముద్ర వేస్తోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. దింతో పాటే ఇటీవలే 75వ సినిమాను ప్రకటించింది.

నాగార్జున కథానాయకుడిగా 2005లో వచ్చిన సూపర్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది అనుష్క శెట్టి. నటిగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ అనతి కాలంలోనే అగ్ర నాయిక జాబితాలో చేరింది. అరుంధతితో నాయికా ప్రాధాన్య కథలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారడమే కాదు.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని రూపొందించేందుకు దర్శక-నిర్మాతలకు స్ఫూర్తినిచ్చింది. చివరిగా నిశ్శబ్దం చిత్రంతో అలరించిన స్వీటీ కాస్త విరామం తీసుకొని ప్రస్తుతం యువ హీరో నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమా చేస్తోంది.

చాంద్‌ సా రోషన్‌ చెహ్రా అనే హిందీ చిత్రంతో 2005లో తెరంగ్రేటం చేసింది తమన్నా. అదే ఏడాది తెలుగులో శ్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రమిది. హ్యాపీడేస్‌ చిత్రం తర్వాత తమన్నా కెరీర్‌ గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే. నాయికగా కొనసాగుతూనే ప్రత్యేక గీతాల్లో నర్తించి కేక పెట్టించిందీ బ్యూటీ. విభిన్న పాత్రలు పోషిస్తూ ఇప్పటికీ స్టార్‌ కథానాయికగానే వెలుగుతోంది. ఇటీవలే ఎఫ్ 3తో అలరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

2004లో క్యూ హో గయా నా అనే హిందీ చిత్రంలోని ప్రత్యేక పాత్రతో తన నట ప్రస్థానం మొదలు పెట్టింది కాజల్‌ అగర్వాల్‌. లక్ష్మిగా 2007లో లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగు వారికి దగ్గరైంది. చందమామ చిత్రంలోని నటనకు ప్రశంసలు అందుకుంది. మగధీరతో టాప్‌ హీరోయిన్‌గా మారిపోయింది. స్టార్ హీరోల్ల సినిమాల్లో నటించింది. ఈ మధ్య తల్లిగా మారిన అమే… ప్రస్తుతం కొడుకుతో మాతృత్వపు క్షణాలను ఆస్వాదిస్తోంది. త్వరలోనే కొత్త చిత్రాలను ప్రకటించే అవకాశముంది.

2001లో వచ్చిన ఇష్టం సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది శ్రియ. ఈ 21 ఏళ్ల కాలంలో ఎన్నో వైవిధ్యభరిత పాత్రలు పోషించింది. యువ కథానాయకులు, అగ్ర కథానాయకులందరితోనూ నటించిన పేరుంది శ్రియకు. కొన్ని చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తించి కనువిందు చేసింది.మధ్యలో పవిత్ర అనే నాయికా ప్రాధాన్య చిత్రాన్ని చేసింది. చాలా కాలం తర్వాత మనం చిత్రంతో ఫామ్‌లోకి వచ్చింది. పెళ్లైనా తన క్రేజ్‌ మాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. గమనం, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.

2003లో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది ప్రియమణి. నటనకు ప్రాధాన్యమున్న కథలు ఎంపిక చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్‌ ప్రారంభించి ఇన్నేళ్లయినా తన హవా కొనసాగిస్తూనే ఉంది. ఇటీవలే రానా హీరోగా తెరకెక్కిన విరాటపర్వంలో ఓ కీలక పాత్రలో, వెంకటేష్‌ కథానాయకుడుగా వచ్చిన నారప్పలో నాయికగా అలరించింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బుల్లితెర ఫై పలు షోలతో ఆకట్టుకుంటోంది.

1999లో నటిగా మెరిసింది త్రిష. జోడీ చిత్రంతో ఆ అవకాశం అందుకుంది. నీ మనసు నాకు తెలుసుతో నాయికగా మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో దర్శనమిచ్చి స్టార్‌ కథానాయికగా మారింది. ఆచార్యలో నాయికగా ఎంపికైనా వ్యక్తిగత కారణాలతో ఆ చిత్రం నుంచి తప్పుకొంది. ప్రస్తుతం పొన్నియన్‌ సెల్వన్‌తో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది.

2003లో బాలనటిగా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన హన్సిక దేశ ముదురుతో 2007లో టాలీవుడ్‌లో కాలుమోపింది. తొలి సినిమాతోనే యువతను ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా ప్రేమ కథల్లో నటిస్తూ యువకుల కలల రాణిగా మారింది. ప్రస్తుతం పార్ట్నర్, రౌడీ బేబీ, మై నేమ్ ఈజ్ శృతి తోపాటు మరో నాలుగు ప్రాజెక్టులలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news