స్వాతంత్ర్య పోరాటానికి దారితీసిన సిపాయి తిరుగుబాటు.. దీని వెనుక ఉన్న కారణాలేంటి..?

-

దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది వీరోచిత పోరాటం చేశారు. బ్రిటీష్‌ బానిస సంకెళ్లను తెంచుకోని స్వేచ్ఛా వాయువులను మనం ఈరోజు పీల్చుకుంటున్నాం అంటే ఆనాడు వాళ్లు చేసిన త్యాగమే.. ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ప్రజల్లో చైతన్యం నింపేందుకు పోరాడిన మహానుభువాలు ఎంతో మంది. అయితే దేశ స్వాతంత్ర్యానికి నాంది పలికిన ఘట్టం 1857 సిపాయి తిరుగుబాటు. దీని గురించి మన చదువుకునే ఉంటాం. కానీ మీకు తెలిసింది పక్కనపెడితే.. తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. మరికొద్ది రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోబోతున్నాం.. మళ్లీ ఓసారి ఆ నాటి చరిత్రను నెమరవేసుకుందామా..!

భారత దేశ స్వాతంత్ర్య ఉద్యమం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది.. “1857 తిరుగుబాటు”! ఈస్ట్ ఇండియా కంపెనీ దశాబ్దాల అరాచక పాలనను తొలిసారిగా వ్యతిరేకించిన పోరాటం అది. భారతీయులు తిరగబడితే ఎలా ఉంటుందో రుచి చూపించి, బ్రిటీషర్లకు చెమటలు పట్టించిన గొప్ప తిరుగుబాటు అది. 1857 తిరుగుబాటుకు కారణాలేంటి? ఆ తర్వాత ఏం జరిగింది? పరిస్థితులు ఎలా మారాయి.

1857 తిరుబాటుకు చాలా పేర్లు ఉన్నాయి. అవి.. సిపాయ్ మ్యూటినీ, ఇండియన్ మ్యూటినీ, గ్రేట్ రెబీలియన్, రివోల్ట్ ఆఫ్ 1857, స్వాతంత్ర్యం కోసం జరిగిన తొలి యుద్ధం! 1857 తిరుగుబాటుకు పలు కీలక కారణాలు ఉన్నాయి.

దేశంలోని బ్రిటీష్ సైన్యంలో భారతీయుల వాటా 87శాతం వరకు ఉండేది. కానీ భారత సైనికులకు బ్రిటీషర్లతో పోల్చుకుంటే జీతం చాలా తక్కువ ఇచ్చేవారు. ఒకటే ర్యాంక్లో ఉన్నా.. వేతనం తక్కువగా ఉండేది. దీనిపై చాలా దశాబ్దాలుగా జవాన్లలో అసంతృప్తి ఉండేది. పైగా ఇంటి నుంచి చాలా దూరంగా వెళ్లి వీరు పనిచేయాల్సి వచ్చేది. చేస్తున్న పనికి, అందే జీతానికి వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండేది. ఇక 1856లో భారత సైనికులు అవసరమైతే సముద్రాలు దాటి కూడా బ్రిటీష్ ప్రయోజనాల కోసం పనిచేయాలని ఆదేశాలు ఇచ్చారు లార్డ్ కన్నింగ్. ఈ మేరకు జనరల్ సర్వీసెస్ ఎన్లైట్మెంట్ యాక్ట్ను ప్రవేశపెట్టారు.

ఇది ఇలా ఉంటే ప్రజలపై భారీ మొత్తంలో పన్నులను విధించడం మొదలుపెట్టింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఫలితంగా రైతులు, జమిందారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీల పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. అప్పులను తీర్చుకోలేక, పన్నులు కట్టుకోలేక నానా తంటాలు పడేవాళ్లు. ఒకానొక దశలో చాలా మంది భూములను కూడా కోల్పోయారు. బ్రిటీష్ సైన్యంలో ఉన్న అనేకమంది భారతీయులు.. వ్యవసాయ కులీల కుటుంబం నుంచి వచ్చిన వారే. గ్రామాల్లో కుటుంబసభ్యులు పడుతున్న కష్టాలు చూసి వారు తట్టుకోలేకపోయారు. వాస్తవానికి ఇవన్నీ చాలా ఏళ్లుగా భారతీయులు అనుభవిస్తున్న కష్టాలే. కానీ 1857 తిరుగుబాటుకు ట్రిగ్గర్ పాయింట్ ఒకటి ఉంది. అదే క్యాట్రిజ్పై చుట్టూ నెలకొన్న వివాదం! ఇదేంటంటే..

భారత సైనికుల చేతికి సరికొత్త ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అందాయి. అయితే.. సమస్యంతా క్యాట్రిజ్తోనే వచ్చింది.. ఆ క్యాట్రిజ్ పేపర్ను నోటితో చింపి, రైఫిల్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. కానీ వాటిని ఆవు, పంది కొవ్వుతో తయారు చేస్తారని ఊహాగానాలు ఉండేవి. ఆవు అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన జంతువు కదా. ఇక హిందూ సైనికుల కోపం కట్టలు తెంచుకుంది. వీరికి ముస్లిం సోదరులు కూడా మద్దతినివ్వడంతో సిపాయి తిరుగుబాటు మొదలైంది.

1857 మార్చ్లో బారక్పోరాకు చెందిన మంగళ్ పాండే క్యాట్రిజ్ను ఉపయోగించేందుకు నిరాకరించాడు. బలవంతం చేసిన అధికారులపై తిరగబడ్డాడు. ఏప్రిల్ 8న మంగళ్ పాండేను ఉరితీశారు. ఇది జరిగిన నెల రోజులకు.. మీరట్కు చెందిన మరో 85 మంది సైనికులు కొత్త రైఫిల్స్ను వాడమని తేల్చిచెప్పేశారు. వారికి 10ఏళ్ల కఠిన జైలు శిక్షపడింది. ఆ తర్వాత ఆ ప్రాంతం జవాన్లు పూర్తిగా తిరగబడ్డారు.

ఇండియాపై పట్టు సాధించేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఆ రోజుల్లో చట్టాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు..అప్పుడే.. మరో వివాదానికి తెరలేపారు బ్రిటీషర్లు. అదే “డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్” దీని ప్రకారం.. సహజంగా వారసులు లేని రాజులు, తమ రాజ్యాలని బిటీషర్లకు ఇచ్చేయాలనేది ఆ చట్టం సారాంశం.. దత్త పుత్రులకు రాజ్యాన్ని పాలించే హక్కు లేదు. హిందూ మతానికి విరుద్ధంగా, పాశ్చ్యాత ఆచారాలను ఇండియాపై రుద్దాలని బ్రిటీషర్లు భావిస్తున్నట్టు అప్పటికే కోపం మీద ఉన్న రాజ్యాలు.. డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ చూసి ఇక విసుగెత్తిపోయాయి.

అయితే ఝాన్సీ రాణి లక్ష్మీ భాయ్కి సహజ సంతానం లేకపోవడంతో దామోదర్ రావును దత్తత తీసుకుంటుంది కదా అతనికి సింహాసనాన్ని కట్టుబెట్టాలని చూడగా.. బ్రిటీషర్లు అడ్డుపడతారు. సిపాయి మ్యుటినీ మొదలైన సమయంలో ఝాన్సీ లక్ష్మీ భాయ్ కూడా బ్రిటీషర్లపై తిరుగుబాటు చేసింది.

కాన్పూర్, లక్నో, బరేలీ, ఝాన్సీ, గ్వాలియర్, పట్నా, రాజస్థాన్ సరిహద్దు వరకు ఈ 1857 తిరుగుబాటు విస్తరించింది. ఒక్కో రాజ్యం ఝాన్సీ లక్ష్మీ భాయ్ తిరుగుబాటుకు మద్దతినస్తూ వచ్చింది. పలువురు రాజులు సైతం బ్రిటీషర్లపై పోరాటంలో పాల్గొన్నారు. మరోవైపు 1857 మే లో ఉత్తర భారతంలోని దేశ సైనికులు దిల్లీవైపు అడుగులు వేశారు. ఆ సమయంలో బ్రిటీష్ సైన్యం అక్కడ లేదు. జెండా ఎగురవేసిన భారత జవాన్లు బ్రిటీషర్ల పింఛనుపై జీవిస్తున్న ముఘల్ రాజు మహదూర్ షా 2ను దేశ చక్రవర్తిగా ప్రకటించారు.

1857 తిరుగుబాటును అంతం చేసేందుకు బ్రిటీషర్లు విశ్వ ప్రయత్నాలు చేశారు. తొలుత ఆలస్యంగా కదిలినా, ఆ తర్వాత వేగంగా పావులు కదుపుతూ.. ఒక్కో తిరుగుబాటు ప్రాంతంపై పట్టు సాధిస్తూ వచ్చారు. చివరికి1858 జులై 8న, అంటే 14నెలల తర్వాత తిరుగుబాటుకు ముగింపు పడింది. తిరుగుబాటు అంతం అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

Independence day 2023

తిరుగుబాటు అంతం అవ్వడానికి కారణాలు..

ఇది దేశం మొత్తం విస్తరించలేదు. స్వాతంత్ర్య కాంక్ష కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. హైదరాబాద్, మైసూర్, కశ్మీర్ వంటి ప్రావిన్సులపై దీని ప్రభావం ఏమాత్రం లేదు. మరోవైపు ఝాన్సీ లక్ష్మీ భాయ్, నానా సాహెబ్ వంటి వీరులు ఉన్నప్పటికీ, దళాలను ఐకమత్యంతో నడిపే నాయకుడు లేకపోవడం తిరుగుబాటు పతనానికి కారణమని చెబుతుంటారు. ప్రధానంగా ఈ తిరుగుబాటుకు ప్రజల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభించలేదు. అదే.. 1947కు 1857కు ఉన్న తేడా. అప్పుడే మద్దుతు ఉండి ఇంకా అన్ని ప్రాంతాలు స్వాతంత్ర్యంకావాలని కోరుకుంటే మనకు అప్పుడే స్వాతంత్ర్యం వచ్చిఉండేది. కింది స్థాయి నుంచి మద్దతు ఉండాల్సిందే. కానీ అది ఇక్కడ జరగలేదు. అదే సమయంలో ధనవంతులైన వ్యాపారులు, జమిందారులు బ్రిటీషర్లకు అనుకూలంగా పనిచేశారు.

తిరుగుబాటు ముగిసిన తర్వాత బ్రిటీషర్లు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. బ్రిటీష్ రాజ్యం కిందకు ఇండియాను చేర్చారు. ఫలితంగా దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ శకం ముగిసిపోయింది. దేశంలోని మతాలు, ఆచారాలకు విలువనిస్తామని బ్రిటీష్ చెప్పింది. పాలనా వ్యవస్థను కీలక మార్పులు తీసుకొచ్చింది. సైనిక వ్యవస్థను పూర్తిగా మార్చేసింది. డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ను తొలగించింది.

1857 సిపాయి తిరిగుబాటు అనుకున్న విజయం సాధించలేకపోయినప్పటికీ.. దేశ స్వాతంత్ర్య కాంక్షను రగిల్చిన తొలి పోరాటంగా చరిత్రలో నిలిచిపోయింది. ఎక్కడైతే అణచివేత చర్యలు హెచ్చుమీరుతాయో, అక్కడ ప్రతిఘటన ఎదురవ్వడం తప్పదని మరోమారు నిరూపించింది. అప్పటి నుంచి అందరిలో స్వాతంత్ర కాంక్ష పెరిగింది. ఎన్నో పారాటాల తర్వాతా చివరికి 1947లో మనకు ఫలితం లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news