‘సీడ్స్‌’ లో మళ్లీ విషవాయువు కలకలం.. 150 మంది మహిళలకు తీవ్ర అస్వస్థత

-

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌)లోని ‘సీడ్స్‌’ దుస్తుల కంపెనీలో మరోసారి విషవాయువు కలకలం రేపింది. ఈ ఏడాది జూన్‌ 3న ఇదే కంపెనీలో విషవాయువు లీకై 469 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాజాగా మంగళవారం అదే కంపెనీలోని బి.షిఫ్టులో పనిచేస్తున్న 150 మంది మహిళా ఉద్యోగులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు.

మరో మూడు గంటల్లో విధులు ముగుస్తాయనగా.. గాఢమైన విషవాయువు విడుదలై మహిళా కార్మికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఒకేసారి పదుల సంఖ్యలో మహిళలు స్పృహతప్పి పడిపోవడంతో కంపెనీలో ప్రాథమిక చికిత్స అందించారు. బాధితులను కంపెనీ అంబులెన్సులు, ఇతర వాహనాల్లో అచ్యుతాపురం పీహెచ్‌సీకి తరలించారు.

స్థానికంగా ఉన్న రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లో సరైన వైద్యసేవలు అందక మహిళా కార్మికులు నరకం అనుభవించారు. రాత్రి 7 గంటలకు ప్రమాదం జరిగినా ప్రభుత్వ యంత్రాంగం బాధితులకు చికిత్స అందించడానికి అచ్యుతాపురానికి ఒక్క వైద్యుడినీ పంపలేదు. గర్భిణులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు.

అచ్యుతాపురం ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ సదుపాయం లేకపోవడంతో ఊపిరందక మహిళా కార్మికులు ప్రాణభయంతో కేకలు వేశారు. వీరిలో ఊపిరి అందనివారిని అంబులెన్సుల్లో అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రికి, వివిధ ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. అచ్యుతాపురంలో 40 మంది వరకు కార్మికులకు చికిత్స అందిస్తున్నారు.

సీడ్స్‌ కంపెనీలో మరోసారి గ్యాస్‌ లీకైందని బ్రాండిక్స్‌ అపెరల్‌సిటీ పరిధిలో పనిచేసే ఇతర కార్మికులకు తెలియడంతో ఆందోళనకు గురయ్యారు. గతంలో జరిగిన ప్రమాదంపై అనకాపల్లి జేసీ కల్పనాకుమారి ఆధ్వర్యంలో నియమించిన నిపుణుల కమిటీ విచారించినా.. ఇంతవరకూ ప్రమాదానికి కారణాలు, విషవాయువు ఎక్కడ నుంచి విడుదలైందో ఇంకా చెప్పలేదు.

విశాఖపట్నాన్ని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి విషాదపట్నంగా మార్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మండిపడ్డారు. నిత్యం అక్కడ ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని మంగళవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. రెండు నెలల వ్యవధిలోనే అచ్యుతాపురం సెజ్‌ సీడ్స్‌ కంపెనీలో రెండు సార్లు గ్యాస్‌ లీకేజీ ఘటనలు జరిగాయంటే ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వ లెక్కలేనితనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news