రిటైర్డ్ ఐఏఎస్ పై చర్యలు ఏపీలో కొత్త వివాదాన్ని రాజేసిందా

-

చాలా కాలం క్రితమే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిపోయారు. ఉన్నట్టుండి ఆ అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జీవో ఇచ్చింది ఏపీ సర్కార్‌. ఈ చర్య ఐఏఎస్‌ వర్గాల్లో కలకలం రేపితే.. జీవో జారీ వెనక ఆసక్తి అంశాలు వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తుంది. ప్రీతి సుడాన్‌. సీనియర్ ఐఏఎస్. ఉమ్మడి ఏపీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2013లో కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిపోయారు. కేంద్ర ఆరోగ్యశాఖలో కీలక హోదాలో విధులు నిర్వహించి ఇటీవలే రిటైర్‌ అయ్యారు కూడా. కాకపోతే 2005-2006లో వ్యక్తిగత సెలవులను దుర్వినియోగం చేశారన్న అభియోగం ఆధారంగా ప్రీతి సుడాన్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తాజాగా ఏపీ సర్కార్‌ జీవో జారీ చేసింది. దాంతో ఒక్కసారిగా ఆమె చర్చల్లోకి వచ్చారు.

స్టడీ టూర్‌ పేరుతో కుటుంబంతో గడిపేందుకు ఆమె అమెరికా వెళ్లినట్టు నిర్దారణ అయిందని.. దీనిపై వివరణ ఇవ్వాలని జీవోలో ఆదేశించింది ప్రభుత్వం. ఇందుకు రెండు వారాల గడువు ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వివరణ అడిగితే తప్పేముందని కొందరు చెబుతున్నా.. ఎప్పుడో 15-16 ఏళ్ల క్రితం నాటి అంశాన్ని సడెన్‌గా ఎందుకు తెరపైకి తెచ్చారన్నదే ఆసక్తిగా మారింది. ఇక్కడే అసలు ట్విస్ట్‌ ఉందని ప్రచారం జరుగుతోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌- ప్రభుత్వం మధ్య వచ్చిన గ్యాప్‌ కారణంగానే ఈ జీవో జారీ అయిందని అధికార వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ గత ఏడాది నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు. ఆ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిమ్మగడ్డ రాసిన లేఖల్లో ప్రీతి సుడాన్‌ పేరు ప్రస్తావనకు వచ్చిందట.

కేంద్ర ఆరోగ్య కార్యదర్శిగా ఉన్న ప్రీతి సుడాన్‌తో చర్చించిన తర్వాతే ఎన్నికలను వాయిదా వేసినట్టు నిమ్మగడ్డ రాసిన లేఖల్లో ఉందట. అయితే అదే సమయంలో రాష్ట్ర సర్కార్‌ ప్రీతి సుడాన్‌ను అప్రోచ్‌ అయిందట. ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలని లెటర్‌ జారీ చేయాలని కోరిందట సర్కార్‌. దానికి ప్రీతి సుడాన్‌ నిరాకరించి.. ఆ అంశాన్ని పెండింగ్‌లో పెట్టారట. ఆ పరిణామాల ఫలితమే ప్రీతి సుడాన్‌పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశిస్తూ జీవో జారీ అయిందని ఐఏఎస్ వర్గాల్లో జరుగుతోన్న చర్చ.

అయితే.. అధికారవర్గాల్లో మరో ప్రచారం కూడా మొదలైంది. ప్రభుత్వానికి సహకరించని అధికారులు రిటైరైనా ఇబ్బందులు తప్పవనే సంకేతాలను పంపేందుకే ప్రీతి సుడాన్‌ జీవో వచ్చిందని చర్చ జరుగుతోంది. కేంద్ర సర్వీసులకు వెళ్లినా వదిలేది లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news