స‌ల‌హాలకు కూడా సుత్తికొట్టాలా బాబూ..?

-

ఇవ్వ‌క ఇవ్వ‌క ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కొన్ని సూచ‌న‌లు చేశారు. క‌రోనా విష‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ఆయ‌న ఎట్ట‌కేల‌కు స్పందించారు. ఆది నుంచి క‌రోనాపై నువ్వు అది చేయ‌లేదు.. ఇది చేయ‌లేదు.. అని చెబుతూ వ‌చ్చిన చంద్ర‌బాబు.. స‌ల‌హాల‌కు మాత్రం దూరంగా ఉన్నార‌నే అప‌వాదును నెత్తిన వేసుకున్నారు. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ చంద్ర‌బాబు ఇలానేనా వ్య‌వ‌హ‌రించేది ? అని కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా చంద్ర‌బాబు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కొన్ని సూచ‌న‌లు చేశారు.

రెడ్‌ జోన్లు, కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్నవారు బయటకు రావలసిన అవసరం లేకుండా.. నిత్యావసర సరుకులను వారి ఇళ్లకే పంపాలని రాష్ట్రప్రభుత్వానికి చంద్రబాబు సూచించారు. కరోనా నియంత్రణకు కొన్ని సూచనలతో వీడియోను విడుదల చేశారు. ‘పరీక్షలు, క్వారంటైన్‌ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అక్కడ కనీస వసతులు లేవన్న ఫిర్యాదులు బాగా వస్తున్నాయి. అందువల్ల బాధితులు ఇంట్లోనే క్వారంటైన్‌ అయ్యేలా చేసి వారికి టెలిమెడిసిన్‌ ద్వారా ఆరోగ్య సలహాలు, సూచనలు ఇప్పించాలి.

అత్యవసరం అనుకున్న వారినే క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలి.“ అని సూచించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన వారికి రూ.15 వేలిస్తోంది. వారి కుటుంబాలను నిలబెట్టడానికి అది చాలదు. రూ.పది లక్షల ఆర్ధిక సాయం అందించాలి అని కోరారు.  ‘కరోనా పరీక్ష కిట్లు, బ్లీచింగ్‌ పౌడర్‌, 104 అంబులెన్సుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి.. వాటినెలా వినియోగిస్తున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.

ప్రతి పౌరుడికీ రూ.పది లక్షల ఉచిత బీమా కల్పించాలని కోరారు. అయితే, సూచ‌న‌ల పేరుతో చంద్ర‌బాబు సుత్తి కొట్టేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు తెర‌మీదికి రావ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి ఏదైనా సూచ‌న అంటే.. సూచ‌న‌గానే ఉండాల‌ని, కానీ.. ఇలా సుత్తి ఎందుకు? అనే వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాల్లో వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news