BREAKING : అవినాష్ ను అరెస్ట్ చేయొద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు

-

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో వివేకా కుమార్తె సునీత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌పై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం వరకు అవినాష్‌ను అరెస్టు చేయొద్దని తెలిపింది. ఆరోజు మరోసారి విచారణ చేపడతామని.. అన్ని విషయాలు పరిశీలిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.

సుప్రీం కోర్టులో సీబీఐ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అవినాష్‌కు బెయిలిస్తే విచారణపై ప్రభావం పడుతుందని తెలిపారు. వివేకా హత్య కేసులో ప్రలోభాలు కూడా పని చేశాయని వివరించారు.  వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం.. హైకోర్టు ఉత్తర్వులు ఆమోదయోగ్యం కావని తేల్చి చెప్పింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పేలవమైనవని పేర్కొంది. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news