ఆ పెద్దాయన హైటెక్ సిటీలో కూడా హరికథ చెప్పగలరు – విజయసాయిరెడ్డి

-

చంద్రబాబుకు పోలవరం ప్రాణం, అమరావతి ఆరోప్రాణమా? అది ప్రశ్నించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ‘ఇదేం ఖర్మరా, బాబూ’ అనుకుంటూనే ఏలూరు జిల్లా జనం వింటున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి నోటికి హద్దూ అదుపులేకుండా పోయిందని మండిపడ్డారు. వినే శ్రోతలు, ప్రేక్షకులు ఉంటే హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలో కూడా హరికథ చెప్పగలరు ఆ ‘పెద్దాయన’ అంటూ ఎద్దేవా చేశారు.

“నిన్న పోలవరం ప్రాంతంలో రోడ్ల మీద తన వాహనం నుంచే ఆయన ప్రసంగిస్తూ, ‘పోలవరం ప్రాజెక్టు నాకు ప్రాణం. నన్ను వచ్చే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే నేను ఈ బహుళార్థక సాధక ప్రాజెక్టును పూర్తి చేస్తా,’ అనే రీతిలో మాజీ ముఖ్యమంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే తప్ప గోదావరిపై పోలవరం పూర్తి కాదన్నట్టు ఉంది ఆయన పోకడ. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దివంగత జననేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి హయాంలో మొదలైంది. చంద్రబాబు గారి హయాంలో కొత్త నిర్మాణ సంస్థ చేతిలో పడి నిలిచిపోయింది.

పోలవరం ప్రాజెక్టును టీడీపీ చివరి సీఎం ఓ పెద్ద స్కాండల్‌ స్థాయికి తీసుకెళ్లారు ‘చాల కష్టపడి’. వేల కోట్ల రూపాయల వ్యయంతో కూడిన పోలవరాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చాలా వరకు గాడిలో పెట్టింది. తన నియంత్రణలో లేని పరిస్థితుల్లో కూడా వైఎస్సార్సీపీ సర్కారు పోలవరం ఆనకట్ట నిర్మాణం పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఓ పక్క ఇంత జరుగుతున్నా చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టును తన ‘ఎన్నికల ఆయుధం’గా మార్చుకోవడానికి అప్పుడే ప్రయాస పడుతున్నారు. పోలవరం పేరు చెప్పి ఐదు ఆరు జిల్లాల ప్రజలను బురిడీ కొట్టించడం అంత తేలికకాదని ఈ మాజీ హెటెక్‌ సీఎం గారికి ఏడాదిన్నర తర్వాత తప్పకుండా అర్ధమౌతుంది.

అలాగే, ‘నేను ఓడిపోతే అమరావతి అటకెక్కుతుంది. పోలవరం పొద్దుగూకి పోతుంది అని హెచ్చరించినా మీరు వినలేదు. తప్పుదిద్దుకోండి. 2024 ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే–పోలవరం పూర్తి చేస్తా,’ అనే రీతిలో సాగాయి చందరయ్య గారి ప్రసంగాలు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చారు కాబట్టి ఆయన ఈ అంశం గురించి దంచి కొడుతున్నారు. ‘జిత్తులమారి తెలివితేటలున్నోళ్లు ఏ పేటకు పోతే ఆ పాట పాడాతారనే’ తెలుగు సామెత గుర్తొస్తోంది ఈ పెద్దన్నయ్య కబుర్తు వింటుంటే. 1982లో నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఆయన మూడో అల్లుడు గారి ఆగడాల వల్ల ఎక్స్‌ పైరీ డేట్‌ దగ్గరపడినట్టు కనిపిస్తోంది.

2004 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక–2009, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితమే చంద్రబాబు అండ్‌ సన్‌ అనే రాజకీయ కంపెనీకి వస్తుంది. అనుమానం లేదు. గుర్తుంచుకో, అన్నయ్యా. పోలవరం, అమరావతి అంటూ ఊళ్లు, ఆనకట్టల పేర్లు చెప్పి ఆంధ్రా ప్రజలను ఏమార్చడం కష్టమే బాబూ” అని సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు పై మండిపడ్డారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news