వైసిపిలో ఓవర్ లోడ్ ? వారిలో పెరిగిపోతున్న ఆందోళన ?

-

తెలుగుదేశం పార్టీని బలహీనం చేయడమే ప్రధాన ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే పెద్ద ఎత్తున నాయకులు వచ్చి చేరారు. ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆ చేరికలకు జగన్ బ్రేకులు వేశారు. టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు వైసిపి అనుబంధంగా వ్యవహరిస్తున్నారు. టిడిపి వారిపై సస్పెన్షన్ వేటు వేయకపోయినా, వారు వైసీపీ సభ్యులు గానే వ్యవహరిస్తూ వస్తున్నారు. నేరుగా ఎమ్మెల్యేలు వైసీపీలో చేరినా వారిపై అనర్హత వేటు పడుతుందనే ఉద్దేశంతో వారు బయటి నుంచి మద్దతు ఇస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ జగన్ జై కొట్టారు. వీరే కాకుండా గంటా శ్రీనివాసరావు తో పాటు, గణబాబు వంటి వరోతో పాటు నలుగురైదుగురు ఎమ్మెల్యేలు వైసిపి కి అనుబంధంగా వ్యవహరించేందుకు సిద్ధమైపోయారట.

ఈ క్రమంలో వారు టిడిపికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కేవలం ఎమ్మెల్యేలే కాకుండా, నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్ద ఎత్తున వైసిపికి అనుబంధంగా కొనసాగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విధంగా వైసీపీలో వరుస చేరికతో సందడిగా కనిపిస్తున్నా , ఆ పార్టీని మొదటి నుంచి నమ్ముకుని ఉన్న వారికి ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే టిడిపి ఇతర పార్టీల నుంచి పెద్దఎత్తున చేరిన నాయకులతో వైసిపి ఓవర్ లోడ్ అయినట్లుగా కనిపిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ, గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి.

మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న వారు, కొత్తగా పార్టీలో చేరినవారు, ఇలా రెండు వర్గాలుగా పార్టీ ప్రతి నియోజకవర్గంలోనూ చీలిపోయింది. అలాగే నామినేటెడ్ పదవులు ఇచ్చే విషయంలో ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో నిత్యం వైసీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతూ, సొంత పార్టీ నాయకులు ఒకరికొకరు విమర్శించుకునే వరకూ పరిస్థితి వచ్చింది. దీంతో కొంతకాలంగా పార్టీ విషయాలపైన జగన్ అసంతృప్తి కి గురవుతున్నట్టుగా తెలుస్తోంది.

ఈ క్రమంలో మరి కొంతమంది నాయకులు పార్టీలో వచ్చి చేరితే, మరిన్ని విభేదాలు పెరిగిపోతాయని, కొత్తగా చేరిన నాయకులు కారణంగా పెద్దగా ఉపయోగం లేకపోవడమే కాకుండా, పార్టీకి తీరని నష్టం జరుగుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా జగన్ మాత్రం టిడిపిని బలహీనం చేసేందుకు చేరికలను ప్రోత్సహించడమే ఏకైక ఆప్షన్ గా భావిస్తున్నారు. ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో అనే ఆందోళన పార్టీ శ్రేణుల్లోనూ పెరిగిపోతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news