ఇప్పుడు ఉన్నది ఇటాలియన్ కాంగ్రెస్.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

-

కాంగ్రెస్ పై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ప్రస్తుతముంది అసలైన కాంగ్రెస్ కాదని.. ఇప్పుడుంది ఇటాలియన్ కాంగ్రెస్ అని కేంద్ర మంత్రులు అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించే క్రమంలో తమ పార్టీ ఎన్నో త్యాగాలు చేసిందంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. దేశం కోసం బీజేపీ కనీసం ఒక శునకాన్నీ కోల్పోలేదని చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘ఇది అసలైన కాంగ్రెస్‌ కాదు. నిజమైన కాంగ్రెస్‌కు చెందిన సుభాష్‌ చంద్రబోస్‌, బాలగంగాధర్‌ తిలక్‌, సర్దార్‌ పటేల్‌ వంటి నేతలతో కాంగ్రెస్‌ పార్టీ ఏ విధంగా వ్యవహరించిందో అందరికి తెలుసు. ప్రస్తుతమున్నది ఇతరులు సారథ్యం వహిస్తోన్న ఇటాలియన్‌ కాంగ్రెస్‌’ అని పరోక్షంగా సోనియా గాంధీని ప్రస్తావిస్తూ పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి మండిపడ్డారు. బోగస్‌ నేతలతో కూడిన బోగస్‌ పార్టీ ‘కాంగ్రెస్‌’ అని పేర్కొన్న ఆయన.. ఆ పార్టీ అధ్యక్షుడు ఓ రబ్బర్‌ స్టాంప్‌ అని విమర్శించారు. కాంగ్రెస్‌ చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపిస్తూ.. స్వాతంత్య్రం అనంతరం కాంగ్రెస్‌ పార్టీని రద్దు చేయాలని మహాత్మా గాంధీ సూచించిన అంశాన్ని గుర్తుచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news