ఖమ్మంలో చంద్రబాబు సభ… తెలంగాణలో టిడిపి జెండా ఎగురడం ఖాయం !

-

ఖమ్మంలో ఈ నెల 21న తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ విజయవంతం చేయాలని తెలంగాణ టిడిపి అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, టిడిపి తెలంగాణ వ్యవహారాల సమన్వయకర్త కంభంపాటి రామ్మోహన్ రావు పిలిపునిచ్చారు. సోమవారం ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశంలో కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ… 21న ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, యావత్ ఖమ్మంతో పాటు అన్ని జిల్లాల నుంచి టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రావడం జరుగుతుందని అని తెలిపారు.

ఈ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం హైదరాబాదులోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి మధ్యాహ్నానికి ఖమ్మం చేరుకుంటారు అన్నారు. ఈ మార్గమధ్యంలో అడుగడుగునా ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాల వద్ద నివాళులు అర్పిస్తారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన విగ్రహాలను ఆవిష్కరిస్తారు అని పేర్కోన్నారు. కనివిని ఎరుగని రీతిలో ఖమ్మం సభ జరగనుందని.. ఈ సభతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తథ్యం అని అన్నారు. ఖమ్మం సభకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని.. ఎన్టీఆర్, చంద్రబాబులు చేసిన అభివృద్ధి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉందని, బీసీలకు పెద్దపీట వేసింది ఎన్టీఆర్, చంద్రబాబులేనని తెలిపారు.

టిడిపి హయాంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి ప్రస్తుత పరిస్థితులపై ప్రజల్లో చర్చ జరుగుతోందని, ఏది మంచి, ఏది చెడు అనేది ప్రజలు నిర్థారణ చేసుకుంటున్నారని పేర్కోన్నారు. తెలంగాణ ప్రజలు మంచికి ఎప్పుడూ మద్దతిస్తారని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా మంచికి ఎప్పుడూ స్వాగతం, చెడుకు ఎప్పుడూ దూరం అని తెలిపారు. తెలంగాణ టిడిపిలో యువతరానికి పెద్దపీట వేస్తున్నామని, కొత్త వారి చేరికలు ఉంటాయని, ఖమ్మం సభ తర్వాత నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్ ఇతర ప్రాంతాల్లో కూడా బహిరంగ సభలు ఉంటాయని, ఈ సమావేశాల తరువాత గతంలో సింహ గర్జన సభ ఎలా జరిగిందో దానికి మించిన సభ హైదరాబాదులో ఉంటుందని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు.

తరువాత కంభంపాటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల ఊపిరి తెలుగుదేశం పార్టీ, తెలుగు ప్రజల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం అని ప్రతి పల్లెలో, పట్టణంలో, నగరాల్లో మూలమూలన టిడిపి చేసిన అభివృద్ధి కనిపిస్తుందిని తెలిపారు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని.. ఆనాడు ఐటీ కి వేసిన విత్తనం ఇప్పడు మహావృక్షంగా మారిందని, నిన్న ఐఎస్ బి లో కూడా అదే చూసామన్నారు.

ఆనాడు చంద్రబాబు సైబరాబాద్ నగరాన్ని నిర్మించి, జీనోమ్ వ్యాలీని అభివృద్ధి చేశారని పేర్కోన్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలోకి వచ్చేవారు.. ఎవరైనా పార్టీలోకి ఆహ్వానితులేనని, టిడిపి చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ఇప్పటి యువతకు తెలియజెప్పడం మన బాధ్యత అని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో యువత భాగస్వామ్యం పెంచడం, తెలంగాణను మళ్ళీ అభివృద్ధి బాట పట్టించడం ఖమ్మం సభ ప్రధాన లక్ష్యం అని అన్నారు. ఈ సభ పార్టీకి దశ దిశను ప్రకటించనున్నదని ఖమ్మంలో టిడిపి శంఖారావంతో తెలంగాణలో టిడిపి పునరుద్తేజం జరుగుతుందని నమ్మబలికారు. తెలంగాణ అభివృద్ధికి పునరంకితం అవుతామని కుంభంపాటి రామ్మోహన్ రావు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ ఆరిఫ్, అట్లూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news