ఐటీ, ఈడీ దాడులపై ఏం చేద్దాం.. మంత్రులతో కేసీఆర్ చర్చ

-

రాష్ట్రంలో ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలు, బంధువులు, మిత్రుల ఇళ్లపై జరుగుతున్న ఐటీ దాడులపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ విషయంపై మంగళవారం రోజున అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఆదాయపన్ను శాఖల వరుస దాడులపై చర్చించారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన విద్యాసంస్థల్లో సోదాలపై ఈ సందర్భంగా ఆరా తీశారు.

మంత్రి మల్లారెడ్డితో సీఎం ఫోన్‌లో మాట్లాడి, ధైర్యం చెప్పారని తెలిసింది. కేంద్రం వైఖరిపై సీఎం ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలను ఎండగట్టేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కేంద్ర సంస్థల దాడుల సమాచారాన్ని సేకరించి, వాటి పూర్వాపరాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కళాశాలలు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, భాగస్వాముల నివాసాల్లోనూ ఐటీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో అధికారులు రూ. 5 కోట్ల నగదు, కీలక పత్రాల స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news