ఆందోళనకారులపై ఇరాన్​ ఉక్కుపాదం.. 31మంది మృతి

ఇరాన్ లో ఆందోళనలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఆందోళనకారులపై ఇరాన్ పోలీసులు దాష్టీకం హింసాత్మకంగా మారుతోంది. హిజాబ్‌ సరిగా ధరించలేదన్న అభియోగంపై అరెస్టయిన ఓ యువతి పోలీసు కస్టడీలో మృతి చెందడంపై.. ఇరాన్‌లో తీవ్ర అల్లర్లు చెలరేగాయి. మహిళల హక్కులు కాలరాస్తున్నారని.. పెద్దఎత్తున ఇరాన్ మహిళలు ఆందోళనకు దిగారు.

గతవారాంతం నుంచి మొదలైన ఆందోళనల్లో ఇప్పటి వరకు 31 మంది చనిపోయినట్లు సమాచారం. మృతుల్లో ఆందోళనకారులతో పాటు పోలీసులు కూడా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇరాన్‌ కఠిన చట్టాలు, పోలీసు జులుంను వ్యతిరేకిస్తూ టెహ్రాన్‌ సహా 17 నగరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

పలుచోట్ల భద్రతాదళాలు, నిరసనకారుల మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. నిరసనలకు సంబంధించిన సమాచారం విస్తృతంగా ప్రచారం కాకుండా ఉండేందుకు ఇరాన్‌ ప్రభుత్వం ఇన్‌స్టాగ్రామ్‌ సేవలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇరాన్‌లో ప్రభుత్వ పెద్దలు, కీలక అధికారులు మినహా ఇతరులెవరూ ఫేస్‌బుక్‌, టెలిగ్రామ్‌, ట్విటర్‌, యూట్యూబ్‌ వంటివి వినియోగించకుండా ఇప్పటికే ఆంక్షలు విధించారు.