ఈటెలతో కేటీఆర్ చర్చలు ఫలించినట్టేనా

-

కేటీఆర్‌తో మాట్లాడిన తర్వాత ఈటెల తగ్గినట్టేనా..తన సంచలన వ్యాఖ్యలకు ఫుల్‌స్టాప్‌ పెడతారా ఇప్పుడిదే టీఆర్ఎస్ నేతల్లో హాట్ హాట్ చర్చకు దారి తీస్తుంది. సంచలన కామెంట్స్‌తో టీఆర్‌ఎస్‌లో వేడిపుట్టిస్తున్న తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌లో సీనియర్‌ నాయకుడు. ఈ మధ్య కాలంలో సీఎం కేసీఆర్ తో కాస్త దూరం పెరిగిందని ప్రచారం నేపథ్యంలో ఈటెలతో మంత్రికేటీఆర్ ప్రగతి భవన్ లో చర్చలు ఆసక్తి రేపుతున్నాయి.

ఇటీవల కాలంలో మంత్రి ఈటెల చేస్తున్న కామెంట్స్‌ సంచలనంగా మారుతున్నాయి. అటు టీఆర్‌ఎస్‌లోనూ.. ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు కూడా దారితీస్తున్నాయి. పార్టీ జెండాలు..కులం..డబ్బు కాదు మనిషిని చూసి రాజకీయం చేయాలంటూ మళ్లీ చర్చల్లోకి వచ్చారు ఈటెల. ఇంతలో మంత్రి ఈటెలను ప్రగతిభవన్‌కు తీసుకెళ్లి గంటకుపైగా మాట్లాడారు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌. మంత్రి కేటీఆర్‌ ఆయనతో ఏం మాట్లాడారు ప్రగతి భవన్‌ మంత్రాంగం తర్వాత ఈటల సైలెంట్ అయ్యారా అన్న ప్రశ్నలు పార్టీవర్గాల్లో జోరందుకున్నాయి.

తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారు ఈటెల. టీఆర్‌ఎస్‌తో సుదీర్ఘ ప్రయాణం సాగిస్తున్నారు. పార్టీలో ప్రాధాన్యం తగ్గిందని అనుమానించారో ఏమో కొన్నాళ్లుగా గులాబీ శిబిరంలో హాట్‌టాపిక్‌గా మారుతున్నారు. ఈటెల్లాంటి మాటలతో హీటెక్కిస్తున్నారు. గతంలో గులాబీ జెండాకు తామే ఓనర్లమని సంచలనం రేపారు. రైతులతో పెట్టుకుంటే పార్టీలకు పుట్టగతులుండవని ఇటీవల ఆయన చేసినా కామెంట్స్‌ చర్చకు దారితీశాయి. కామ్‌గా ఉంటే మంత్రిగారు ఇలా అడపాదడపా పేలుస్తున్న మాటల మంటలు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు? ఎవరిని గురిపెట్టారు అని ఆరా తీశారు నాయకులు. ఇప్పుడు ధర్మం న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోదని తాను ఇబ్బంది పడొచ్చు.. గాయపడొచ్చు.. మనసు మార్చుకోలేదనిపెట్టిన చెయ్యి ఆగదని.. తాను ఆగబోనని ఈటెల కలకలం రేపారు.

అసెంబ్లీ సమావేశాలకు హాజరైన మంత్రి ఈటెల తిరిగి వెళ్తుంటే.. అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఆయన దగ్గరకు వెళ్లారు. ఈటెల చేయి పట్టుకుని కారులో ఎక్కించుకుని సరాసరి ప్రగతిభవన్‌కు వెళ్లారు. గంటకుపైగానే మంతనాలు, మంత్రాంగం జరిగినట్టు సమాచారం. భేటీ తర్వాత ఈటెల సైలెంట్‌గా వెళ్లిపోయారు. అటు పార్టీ నుంచి కానీ..ఇటు ఈటల శిబిరం నుంచి గానీ స్పందన లేదు. లీకులు లేవు ఊహాగానాలు కూడా లేవు. అంత గుంభనంగా ఉన్నారు.
ప్రగతి భవన్‌ చర్చలు ఫలించాయా.. కేటీఆర్‌తో మాట్లాడిన తర్వాత ఈటెల ఆగినట్టేనా కొంత గ్యాప్‌ ఇచ్చి మళ్లీ తనదైన పంథాలో ఈటెల మాటల తూటాలు పేలుస్తారా గులాబీ శిబిరంలో ఈ అంశాలపైనే చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news