మిథిలా వర్సిటీలో గందరగోళం.. వందకు 151 మార్కులు.. అయినా ఫెయిల్.. !

-

బిహార్ దర్భంగా జిల్లాలోని లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ నిర్లక్ష్యం.. విద్యార్థులకు ఇబ్బందులను తెచ్చిపెట్టింది. కొందరికి గరిష్ఠానికి మించి మార్కులు రాగా.. ఇంకొందరికి గుండు సున్నాలు వచ్చాయి. పలువురు విద్యార్థులు ఫెయిల్ అయినట్లు ప్రకటించి.. వారిని పైతరగతికి ప్రమోట్ అయినట్లు మార్క్ షీట్ లో  పేర్కొనడం చర్చకు దారి తీసింది.
లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఫలితాల్లో ఎంఆర్జేడీ కాలేజీకి చెందిన బీఏ మూడో ఏడాది విద్యార్థి అన్మోల్ కుమార్​కు.. ‘పొలిటికల్ సైన్స్ హానర్స్’ నాలుగో పేపర్​లో 151 మార్కులు వచ్చాయి. ఈ పేపర్​లో గరిష్ఠ మార్కులు 100 కాగా.. అంతకుమించి మార్కులు రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొత్తం 420 మార్కులు వచ్చాయి. అయితే, మార్క్​ షీట్ లో మాత్రం అతడు ఫెయిల్ అయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫలితాలు చూసి విద్యార్థి అయోమయానికి గురవుతున్నాడు.
మరోవైపు, యూనివర్సిటీ పరిధిలోని ఎంకేఎస్ కళాశాలలో చదువుతున్న సోనూ కుమార్​కు.. ఓ పేపర్​లో గుండుసున్నా వచ్చాయి. అకౌంటెన్సీ, ఫైనాన్స్ హానర్స్ నాలుగో పేపర్​లో సున్నా మార్కులు వచ్చినట్లు ఫలితాల్లో తేలింది. అయినప్పటికీ పరీక్షలో పాసైనట్లు మార్క్​ షీట్ లో కనిపించింది.
ఫలితాలపై స్పష్టత కరవైన నేపథ్యంలో అన్మోల్ కుమార్.. కళాశాల ప్రిన్సిపల్​ను సంప్రదించాడు. అనంతరం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన యూనివర్సిటీ యంత్రాంగం.. తొలుత విద్యార్థుల మార్క్​షీట్లను వెబ్​సైట్ నుంచి తొలగించింది. అనంతరం ఫలితాలను సరిచేసింది. ఇద్దరికీ కొత్త మార్క్​షీట్లు జారీ చేసినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు. టైపింగ్ దోషాల వల్ల ఇలా జరిగిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news