ఎన్నికల ముంగిట పీఆర్సీ చర్చలపై కొత్త రచ్చ

-

తెలంగాణలో ఉద్యోగుల ఎదురుచూపులకు తెర దించుతూ మూడేళ్ల తర్వాత పీఆర్సీ రిపోర్ట్‌ వచ్చింది. అందులోని సిఫారసులు ఉద్యోగులను నిరాశపరిచాయి. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే పీఆర్సీ నివేదిక పై ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తుంటే ఇక చర్చలకు అన్ని సంఘాలను పిలవకుండా కొందరినే పిలవడంతో చర్చలకు ఆహ్వానం అందని యూనియన్లు ఫైరవుతున్నాయట గ్రాడ్యుయేట్ ఎన్నికల ముంగిట దీని పై ఇప్పుడు కొత్త రచ్చ మొదలైంది.


వేతన సవరణపై కమిషన్‌ రిపోర్ట్‌ అందిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలో ముగ్గురితో కమిటీ వేశారు సీఎం కేసీఆర్‌. ఒకవైపు పీఆర్సీ సిఫారసులపై ఉద్యోగులు భగ్గుమంటోన్న సమయంలోనే ఈ చర్చల ప్రక్రియ మొదలైంది. కొన్ని సంఘాలతో భేటీ కూడా జరిగింది. అయితే అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను పిలిచి అభిప్రాయాలను తెలుసుకోవాలన్నది ఆయా యూనియన్ల అభిమతం. కానీ.. సీఎస్‌ కమిటీ పెట్టిన మెలికతో కొన్ని సంఘాలు ఇరకాటంలో పడ్డాయి.

అదర్‌ డ్యూటీ సౌకర్యం ఉన్న సంఘాలను మాత్రమే చర్చలకు పిలవాలని సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ ఒక ప్రాతిపదిక పెట్టుకుంది. గత నెల 27 నుంచి 29 వరకు జరిగిన చర్చలకు OD సౌకర్యం ఉన్న యూనియన్లనే పిలిచారు. దాదాపు 13 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆ సమావేశానికి వచ్చాయి. పీఆర్సీ సిఫారసులపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి. చర్చల విషయంలో కొన్ని యూనియన్లనే పిలవడం ఏంటని మిగతా ఉద్యోగ సంఘాలు ఫైరవుతున్నాయి. ఇలాంటి వారితో రాష్ట్రంలోని విపక్ష పార్టీలు కూడా శ్రుతి కలిపాయి.

దీంతో ఎన్నికల ముంగిట పీఆర్సీ చర్చల అంశం కొత్త టర్న్ తీసుకుంది.
ఈ డిమాండ్ల తర్వాత సీఎస్‌ కమిటీ మనసు మార్చుకుందో ఏమో .. మరికొన్ని సంఘాలతో భేటీ కావాలని నిర్ణయించింది. వారితో సమావేశానికి సంబంధించిన షెడ్యూల్‌ ఖరారు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఇప్పుడు అందరి దృష్టీ సీఎస్‌ ఆఫీస్‌పై ఉంది. ఏ ప్రాతిపదికన.. ఎన్ని సంఘాలను చర్చకు పిలుస్తారు..పిలవడం మొదలుపెడితే అంతే ఉండదనే కామెంట్స్‌ ఉద్యోగ సంఘాల్లోనే వినిపిస్తున్నాయి. ఇలా అందరికి పిలుపు రాకపోతే మిగతా యూనియన్ల ముందు చులకన అవుతామని భావిస్తోన్న సంఘాలు క్రమంగా స్వరాలు పెంచుతున్నాయి.

ఇంకోవైపు రోజులు గడుస్తున్నా సీఎస్‌ కమిటీ నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేకపోవడంతో ఆహ్వానాల కోసం ఎదురు చూస్తోన్న సంఘాలు డైలమాలో పడ్డాయట. అందరినీ చర్చలకు పిలవాలని డిమాండ్‌ చేసి తప్పు చేశామా అని చెవులు కొరుక్కుంటున్నాయట. పైగా తమ డిమాండ్‌ను అడ్డంపెట్టుకుని సీఎస్‌ కమిటీ చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని మరికొందరు అనుమానిస్తున్నారట. గ్రాడ్యుయేట్ ఎన్నికల ముంగిట ఈ వివాదం మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news