పదేళ్లు గడిచినా దేశంలో పరిస్థితులు మారలే.. నిర్భయ తల్లిదండ్రుల ఆవేదన

-

2012 డిసెంబర్‌ 16. సరిగ్గా పదేళ్ల క్రితం.. దేశ రాజధాని దిల్లీలో దారుణం జరిగింది. ఓ అమ్మాయిపై దిల్లీ నడిబొడ్డున సామూహిక అత్యాచారం జరిగింది. నిర్భయ ఘటనగా పేరొందిన ఈ అత్యాచార ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్లమెంట్‌నూ కుదిపేసింది. దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం ‘నిర్భయ’ పేరుతో చట్టం తీసుకొచ్చింది. తర్వాత కాలంలో నిర్భయ ఘటనలో దోషులకు శిక్ష పడింది.
ఎన్ని చట్టాలు తెచ్చినా.. కఠిన శిక్షలు విధించినా కొందరు కీచకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. మహిళలపై దాడులు, అత్యాచారాలు ఎప్పటిలానే కొనసాగుతున్నాయి. ‘నిర్భయ’ ఘటన జరిగి 10 ఏళ్లయినా ఈ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదని నిర్భయ తల్లిదండ్రులు వాపోతున్నారు. తమ కూతురిలా ఎంతో మంది ఆడపిల్లలు ప్రతిరోజు తమ మాన, ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గడిచిన పదేళ్లలో ఏమాత్రం మార్పు రాలేదని, నిర్భయకు తప్ప ఎవరికీ న్యాయం జరిగిందని తాను అనుకోవడం లేదని నిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు. దేశంలో ఇప్పటికీ మహిళలకు భద్రత లేదని నిర్భయ తండ్రి బద్రీ నారాయణ తెలిపారు. ఇప్పటికీ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతూనే ఉన్నారని అన్నారు.  లైంగిక వేధింపుల నుంచి బయటపడిన వారు ఇప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నారని, ఇదొక్కటే కొత్తగా వచ్చిన మార్పు అని ఆశాదేవి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news